కాటారం, ఆగస్టు 1 : మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. గణేశ్ తన భార్య సంధ్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. సంధ్య తల్లిదండ్రులు రెండు, మూడు సార్లు అదనపు కట్నం కూడా ఇచ్చారు. కాటారంలోనే నివాసముంటున్న వీరు కరోనా తర్వాత ఒడిపిలవంచకు వెళ్లిపోయారు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉందామని భర్త గణేశ్.. లేదు కాటారంలో ఉందామని భార్య చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఫర్టిలైజర్ దుకాణం పెట్టడం కోసం మళ్లీ డబ్బులు తీసుకురావాలని భార్యను వేధించి నెల క్రితం పుట్టింటికి పంపాడు. సంధ్య తల్లిదండ్రులు మళ్లీ రూ.లక్ష ముట్టజెప్పారు. లక్ష సరిపోదు.. ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలని వేధించసాగాడు. గణేశ్కు అతడి తల్లి కూడా సపోర్ట్ చేసేది.
ఈ క్రమంలోనే 30వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త గణేశ్ కర్రతో కొట్టగా ఆమె కింద పడిపోయింది. పక్కనే ఉన్న రోకలి బండతో తలపై కొట్టాడు. అప్పటికీ చనిపోకపోతే తలను బండకు కొట్టి హత్య చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలో ఉన్న మెట్ల వద్ద బురదలో జారి పడి తల పగిలి చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక విషయాన్ని సర్పంచ్, తన తల్లికి చెప్పాడు. వారు అక్కడకు చేరుకొని మృతురాలి తల్లికి సమాచారమిచ్చారు. విషయం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, అనుమానం రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా విచారిస్తుండగా, మంగళవారం సంధ్య భర్త గణేశ్, తల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. తానే రోకలి బండతో కొట్టి సంధ్యను హత్య చేశానని భర్త అంగీకరించాడని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ చెప్పారు. అలాగే గణేశ్ ఇద్దరు సోదరులు, బావలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై అభినవ్ పాల్గొన్నారు.