వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లాది నిధులు వెచ్చిస్తూ మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నది. తాజాగా రూ. 300కోట్లతో ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్టీవో ఆఫీసు జంక్షన్ నుంచి ఈఎస్ఐ మీదుగా ఎనుమాముల వరకు 200 అడుగుల వెడల్పు, 8 కిలోమీటర్ల పొడవుతో ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నది. మూడు ఎకరాల విస్తీర్ణంలో వరంగల్లో జీ ప్లస్ ఫైవ్ మోడల్ బస్స్టేషన్ నిర్మించనుండగా, ఏడాదిలోపు 32 ప్లాట్ఫామ్స్తో కూడిన గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులోకి రానున్నది. అలాగే దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి కాగా, శనివారం వరంగల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
– వరంగల్, జూన్ 15(నమస్తేతెలంగాణ)
వరంగల్, జూన్ 15(నమస్తేతెలంగాణ) : సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా వరంగల్లో రూ.300 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మించేందుకు నిర్ణయించింది. రెండు వందల అడుగుల వెడల్పుతో ఎనిమిది కిలోమీటర్ల ఐఆర్ఆర్ను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కుడా ఆధ్వర్యంలో భూసేకరణ జరుగుతోంది. ఇక్కడ వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిలోని ఆర్టీవో ఆఫీసు జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డులోని ఈఎస్ఐ హాస్పిటల్ (కట్టమల్లన్న టెంపుల్) మీదుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గేట్ వరకు నిర్మించేందుకు అధికారులు ఇప్పటికే అలైన్మెంట్ చేశారు. భూసేకరణ కూడా దాదాపు ఎనభై శాతం వరకు పూర్తయినట్లు చీఫ్ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి చెప్పారు. యజమానుల అంగీకారంతోనే భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఐఆర్ఆర్ నిర్మాణంపై కలెక్టర్ పీ ప్రావీణ్య కుడా, రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 17న వరంగల్ పర్యటనలో ఐఆర్ఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ప్రయాణికులు ఖమ్మం హైవే నుంచి నేరుగా ఆర్టీవో కార్యాలయం జంక్షన్ మీదుగా నర్సంపేట రోడ్డు, ఎనుమాములకు చేరుకునే సౌకర్యం ఏర్పడనుంది. అక్కడి నుంచి వరంగల్- ములుగు 163 ఎన్హెచ్కూ చేరుకోవచ్చు. ఐఆర్ఆర్ నిర్మాణంతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో పాటు వరంగల్పై ట్రాఫిక్ భారం తగ్గనుంది.
పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లు..
తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం 2,200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. దూపకుం ట వద్ద 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.106 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షల చొప్పున కేటాయించింది. ఇక్కడ దాదాపు 600 ఇండ్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా 1,400 ఇండ్లు స్లాబ్, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితర దశల్లో ఉన్నట్లు చెప్పారు. దేశాయిపేట వద్ద జర్నలిస్టుల కోసం మరో 200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం కోసం మొదట రూ.10.60 కోట్లు ప్రభుత్వం మం జూరు చేసింది. రహదారులు, భవనాల శాఖ వీటి నిర్మా ణ పనులను పర్యవేక్షిస్తున్నది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించేందుకు అదనంగా మరో రూ.2 కోట్లు కేటాయించింది. పెయింటింగ్ వంటి పనులను పూర్తి చేసి శనివా రం మంత్రి కేటీఆర్తో ప్రారంభించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు ముస్తాబు చేస్తున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని ఇటీవల దూపకుంట, దేశాయిపేటను సందర్శించి డబు ల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
32 ప్లాట్ఫామ్స్తో బస్స్టేషన్..
వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.74.50 కోట్లు మంజూరు చేసింది. పాత బస్స్టేషన్ వద్ద సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం కోసం కుడా అధికారులు ప్రణాళిక రూపొందించారు. జీ ప్లస్ ఫైవ్ అంతస్తులతో దీన్ని నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం 32 ప్లాట్ ఫామ్స్తో గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. దీనిపైన నిర్మించే ఐదు అంతస్తులు పూర్తిగా కమర్షియల్. మొదట గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఏడాదిలోపు నిర్మించి ఆర్టీసీకి అప్పగించే దిశగా కుడా అధికారులు ముందుకు వెళ్తున్నారు. వచ్చే మే లేదా జూన్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేస్తామని కుడా సీపీవో అజిత్రెడ్డి చెప్పారు. ఈ బస్స్టేషన్ నిర్మాణ పనుల కోసం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ ప్రక్రియ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న బస్స్టేషన్ సమీపంలో రూ.కోటి వెచ్చించి తాత్కాలిక బస్స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ముస్తాబైనఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు..
వరంగల్ ఓ సిటీలో ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించింది. రూ.కోటికి పైగా నిధులతో చేపట్టిన ఈ కార్యాలయ నిర్మాణ పనులను ఆర్అండ్బీ ఇంజినీర్లు పర్యవేక్షించారు. నిర్మాణం పూర్తయిన ఈ ఆఫీసు ప్రారంభంతోనే కేటీఆర్ పర్యటన మొదలు కానుంది. అలాగే సుమారు రూ.160 కోట్లతో తూర్పు నియోజకవర్గం పరిధిలో నిర్మించిన 16 సీసీ, బీటీ రోడ్లను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఉర్సు గుట్ట వద్ద రూ.15 కోట్లతో నిర్మించిన ఎస్టీపీ, ఖిలావరంగల్లో రూ.9 కోట్లతో నిర్మించిన ఫకాడ్ లైటింగ్ను కూడా ప్రారంభిస్తారు. ఖమ్మం హైవే నుంచి వచ్చే మురుగు నీరు ఇన్నాళ్లు ఉర్సు చెరువులోకి చేరేది. ఇక నుంచి అది నేరుగా ఎస్టీపీలోకి వెళ్లి శుద్ధి అయ్యాక ఉర్సు చెరువులోకి చేరనుంది.