మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబురంగా నిమగ్నంకాగా పెసర, మక్క, పత్తి మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయి. వానకాలం ప్రారంభం నుంచి ఇదే పెద్దవాన కావడంతో సాగు పనులు జోరందుకున్నాయి. నెల నుంచి వానలు లేకపోవడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటలకు ప్రతికూల పరిస్థితి నెలకొంది.
తాజా వానలు ఆ పరిస్థితిని మార్చేశాయి. ఆరు జిల్లాల్లోనూ రైతులు వరి నాట్ల కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి సహా ఇతర మెట్ట పంటలకు ప్రస్తుత వానలు ఊపిరి పోశాయి. రెండు, మూడు రోజుల్లో వరి నాట్లు మొదలుకానున్నాయి. కాగా మహబూబాబాద్ జిల్లా గంగారంలో 5.7, జఫర్గఢ్లో 5.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
– హనుమకొండ సబర్బన్/ నర్సింహులపేట/శాయంపేట, ఫొటోగ్రాఫర్లు వరంగల్, జూలై 5