‘శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలుత పోలీసు వ్యవస్థనే బలోపేతం చేసింది. పోలీసు అధికారులు విధులు నిర్వర్తించేందుకు ప్రతి ఠాణాకు సొంత వాహనాలను సమకూర్చింది. కేసులను త్వరతగతిన పరిష్కరించేందుకు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ బీ గోపి, వరంగల్ సీపీ రంగనాథ్తో కలిసి ఎనుమాముల పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఠాణాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పోచమ్మమైదాన్ (కాశీబుగ్గ), డిసెంబర్ 21 : ప్రజల సమస్యలు తీర్చేందుకే ఎనుమాములలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ 14వ డివిజన్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మొదటి గేటు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్, శిలాఫలకాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. దీన్ని కాపాడడం మనందరి బాధ్యత అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు స్టేషన్ల పరిస్థితులు దీనంగా ఉండేవని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి స్టేషన్లలో వసతులు కల్పించినట్లు వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్కు సొంత వాహనాలు, అదనపు ఖర్చుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. హోంగార్డుల జీతాన్ని పెంచి వారి గౌరవాన్ని కాపాడినట్లు వివరించారు. గతంలో ఏదైనా కేసు ఛేదించేందుకు చాలా రోజుల సమయం పట్టేదని తెలిపారు. ప్రస్తుతం మన పోలీసులు ఆధునిక టెక్నాలజీతో కేసులు తొందరగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు బాగు పడితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో బాగు పడుతుందని తెలిపారు.
నెరవేరిన ప్రజల చిరకాల వాంఛ : ఎమ్మెల్యే అరూరి
ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటుతో ఎనుమాముల ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అసియాలోనే అతిపెద్ద ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి : సీపీ
హైదరాబాద్ తరహాలో వరంగల్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి అవుతోందని పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. ట్రాఫిక్ ఇతర సమస్యలు కుడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎనుమాముల చుట్టు 15 గ్రామాలతో పాటు కొత్తపేట, ఆరెపల్లి, పైడిపల్లి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా మంచి భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 24 గంటల నిఘా కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తూర్పాటి సులోచనాసారయ్య, జన్ను షీభారాణి అనిల్, అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్, మార్కెట్ సెక్రటరీ బరుపాటి వెంకటేశ్రాహుల్, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, హన్మకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, ఎనుమాముల సీఐ చేరాలు, ఇంతెజార్గంజ్ సీఐ మల్లేశ్యాదవ్, గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ముడుసు నరసింహా, నేరెల్ల రాజు, కేతిరి రాజశేఖర్, పత్రి సుభాశ్, రాజపోషాలు, గండ్రాతి భాస్కర్, పీ మల్లయ్య పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు..
ఎనుమాముల పీఎస్ పరిధిలో 14వ డివిజన్లోని ఎనుమాముల మార్కెట్, రెడ్డిపాలెం, కారల్ మార్స్కాలనీ, చాకలి ఐలమ్మనగర్, ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎస్ఆర్నగర్, మణికంఠకాలనీ, సాయిగణేశ్, ఇందిరమ్మ , గణపతి, లక్ష్మీ గణపతి కాలనీలు వస్తాయి. అలాగే, 3వ డివిజన్లోని పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట వస్తాయని అధికారులు తెలిపారు. గతంలో ఇంతెజార్గంజ్ పీఎస్ పరిధిలోని 14వ డివిజన్, హసన్పర్తి స్టేషన్ పరిధిలోని ఆరెపల్లి, పైడిపల్లి, ఆత్మకూరు స్టేషన్ పరిధిలో కొత్తపేట ఉండేవి. ఇక నుంచి అవి ఎనుమాముల పీఎస్ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.