సిద్దిపేట, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని విడుదల చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఒకటో పంపును ఆన్ చేసి నీటిని రిజర్వాయర్లోకి వదిలారు. సుమారు 2 నుంచి 3టీఎంసీల వరకు నీటిని ప్రస్తు తం నింపనున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపక్షాలు అడగడుగునా అడ్డంకులు సృష్టించాయి. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారు. వాటిన్నింటిని అధిగమించి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టును ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద 2008 -09 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నీటిని ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్మానేరుకు వచ్చి, అక్కడి నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గౌరవెల్లి లిఫ్ట్ కెనాల్ ద్వారా నింపేలా ప్రణాళిక చేసి 2008-09లో గౌరవెల్లి ప్రాజెక్టును మొదలు పెట్టారు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు దీని సామర్థ్యం 1.41 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలిసి గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణ సామర్థ్యం తక్కువగా ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. దీంతో 2015లో గౌరవెల్లి సామర్థ్యం 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో ఆ మేరకు భూసేకరణ చేయడంతో ముంపు గ్రామాలకు కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించి మెట్ట ప్రాంతా న్ని సస్యశ్యామలం చేయడం కోసం యుద్ధ్దప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామం వద్ద గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించారు. గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవ్యనాయక్ తండా, బోంద్యానాయక్ తండా, జలుబాయి తండా, చింతల్ తండా,తిరుమల్ నాయక్ తండాలు ముంపునకు గురయ్యాయి. గౌరవెల్లి, జనగామ, రేగొండ, గండిపల్లి, నం దారం గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. రీడిజైనింగ్లో భాగంగా వరద కాల్వ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని, కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని, పంపుల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచింది.
మిడ్ మానేరు నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు గౌరవెల్లి రిజర్వాయర్లోకి వస్తున్నాయి. తోటపల్లి నుంచి నార్లాపూర్ వరకు 8 కిలోమీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి గొట్లమిట్ట వరకు అప్రోచ్ కెనాల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా రేగొండ పంప్హౌస్కు గోదావరి జలాలు చేరుకుంటాయి. రేగొండ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా నీటిని గౌరవెల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. 32 మెగావాట్స్ 3 మోటర్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహాబలి మోటర్లు బిగించారు. గురువారం ఒకటో నెంబర్ పంప్ను ఆన్ చేసి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తి పోశారు.
గౌరవెల్లి కుడి ప్రధాన కాల్వ ద్వారా 90,000 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 16,000 ఎకరాలు, మొత్తం 1,06,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట, వరంగల్ అర్బన్, కరీంనగర్, జనగామ జిల్లాల రైతులకు సాగునీటితో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండల్లాలోని 57,852 ఎకరాలకు సాగునీరు అందనున్నది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని వేలేరు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, ఖాజీపేట, చిల్పూర్, స్టేఫన్ ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్గఢ్ మండలాల్లోని 48,148 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. గౌరవెల్లి కుడి, ఎడమ ప్రధాన కాల్వలది పోను, మిగతా 14వేల ఎకరాలకు గండిపల్లి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తారు.