వరంగల్,మే 14 : గ్రేటర్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ హల్లో మధ్యాహ్నం 11.30 గంటలకు సమావేశం జరుగనుంది. నగరాభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ కౌన్సిల్ సమావేశంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. కాగా, ఈ సారి బల్దియా సర్వసభ్య సమావేశం ఎజెండాలో ఎనిమిది అంశాలు చేర్చారు. మేడే కానుకగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పారిశుధ్య కార్మికులకు రూ.వెయ్యి జీతం పెంపు నిర్ణయం అమలులో భాగంగా 452 మందికి వర్తింపజేసేలా కౌన్సిల్లో తీర్మానం చేయనున్నారు. ఇండోర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ పద్ధ్దతిలో పనిచేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ ఎం శ్రీధర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో ఏడాది పొడిగించేందుకు కౌన్సిల్లో చర్చించనున్నారు. జూడో కోచ్గా పని చేసేందుకు జన్ను సునీతను నియమించేందుకు అనుమతి తీసుకోనున్నారు.
3వ డివిజన్ పరిధి ఆరేపల్లి గ్రామంలోని ప్రతిమ క్యాన్సర్ దవాఖాన నుంచి తురక చెరువు వరకు 1.50కోట్ల మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సీసీ బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి కౌన్సిల్లో అనుమతి తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాత పైపులైన్లను తొలగించి రూ.3.85కోట్ల 15 ఆర్థిక సంఘం నిధులతో కొత్త పైపులైన్ వేయడానికి పరిపాలనా అనుమతులు తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో డ్యామేజ్ అయిన ఫీడర్ మెయిన్స్, ట్రంక్ మెయిన్స్ను రూ. 2.57కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో మార్చుటకు కౌన్సిల్ ఆమోదం తీసుకోనున్నారు. కాకతీయ సప్తాహ వేడుకలను వారం రోజులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వివిధ కార్యక్రమాల నిర్వహణకు రూ.99,80,052 చెల్లించేందుకు కౌన్సిల్ ఆమోదం తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పాడైపోయిన స్లూయిన్ వాల్వ్లను మార్చేందుకు రూ.20.82లక్షలతో టెండర్లు పిలిచేందుకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు. ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత డివిజన్ల వారీగా సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.