సర్కారు బడిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వం, దాతల సహాయ, సహ కారాలతో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందుతున్నాయి. దీనికి తోడు బాలసభ నిర్వహణతో పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతోంది. అలాగే సర్కారు పంపిణీ చేస్తున్న దుస్తులతో పాటు కలర్ యూనిఫామ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా విద్యార్థులు యూనిఫామ్తో పాటు టై, బ్యాడ్జీ, బెల్ట్ ధరించి రావడంతో సర్కారు స్కూలుకు కొత్త కళఉట్టిపడుతోంది.
వరంగల్ 21వ డివిజన్ ఎల్బీ నగర్లో ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలను సొంత భవనంలో నడిపి స్తున్నారు. ఫస్ట్ క్లాసు నుంచి టెన్త్ క్లాస్ వరకు బోధిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రభుత్వంతో పాటు దాతలు వసతులు సమకూర్చుతున్నారు. అప్పటి హెచ్ఎం బొలుగొడ్డు జయప్రకాశ్ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని వివేకానంద యోగా సేవా సంస్థ తరఫున తూర్పు ముఖంగా గేట్, వాటర్ కూలర్ అందించారు. ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ తరగతి గదుల్లో స్పీకర్లు, ఫ్యాన్, మైక్సెట్, వారి సోదరుడు వంగరి పద్మారావు ఆధ్వర్యంలో రెండు వాటర్ ట్యాంకులు, వీ లవ్యూ ఫౌండేషన్ తరఫున వాటర్ ఫ్యూరిఫయర్ పరికరాలను సమకూర్చారు. రోటరీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డెస్క్లు, దివంగత డాక్టర్ నాగేశ్వర్ రావు ప్రత్యేకంగా పిల్లల కోసం డైనింగ్ హాల్ ఏర్పాటు చేయించారు. అలాగే ఐదేళ్ల నుంచి సాయి ట్రస్ట్ ప్రతినిధి లక్ష్మి పదో తరగతి విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ అందిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్లు, పిల్లలకు పుస్తకాలు, నోట్బుక్స్ను అందజేశారు.
ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని మార్పులు..
ఈ విద్యా సంవత్సరంలో పాత వారితో పాటు ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు కలిసి నూతన మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో స్నేహభావం, క్రమశిక్షణ అలవడడానికి ప్రత్యేకంగా ప్రతి శనివారం బాలసభ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో పిల్లలను జట్లుగా ఏర్పాటు చేసి, వారికి చదువుపై శ్రద్ధ పెంచడంతో పాటు విద్యేతర కార్యక్రమాల్లో కూడా తర్ఫీదును ఇస్తున్నారు. ఈ సందర్భంగా జట్టు విద్యార్థులే బాలసభ నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. తెలుగు పండిట్ దీనికి ఇన్చార్జిగా ఉంటూ పిల్లలు చేయాల్సిన పనులపై వివరిస్తారు.
పిల్లలే సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారిలో పోటీతత్వం పెంచుతున్నారు. అలాగే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాటలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పిల్లల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెరుగడంతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా బోధన జరుగుతోంది. బాగా చదివిన, రాసిన పిల్లల పేర్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తూ, ప్రోత్సాహకంగా బహుమతులను అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమంతో విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నారు.
కలర్ యూనిఫామ్స్తో నూతన ఒరవడి..
ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో మాదిరిగా కలర్ యూనిఫామ్స్ను ఈ పాఠశాలలో అమలు చేస్తున్నారు. విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి కొన్ని పాఠశాల బాధ్యతలు అప్పజెబుతారు. ఇందులో రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్ గ్రూపులుగా విద్యార్థులను విభజిస్తారు. వీరు ఆయా గ్రూపుల ప్రకారం కలర్ డ్రెస్ యూనిఫామ్తో పాఠశాలకు రావాలి. ప్రభుత్వం పంపిణీ చేసిన దుస్తులను ధరిస్తూనే, వారంలో బుధ, శనివారాల్లో మాత్రమే కలర్ యూనిఫామ్స్ వేసుకుని ప్రత్యేకంగా కనబడుతారు. ఈ యూనిఫామ్స్ కొంత మందికి పాఠశాల ఉపాధ్యాయులే డబ్బులు ఇచ్చి సమకూర్చారు. అలాగే ఇన్నర్వీల్ క్లబ్ తరఫున అధ్యక్షురాలు భార్గవి, పూర్వ అధ్యక్షురాలు లలిత, సుభద్ర కలిసి 20 మంది విద్యార్థులకు, కాజీపేట జాగీర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్పాల్ 8 మంది విద్యార్థులకు కలర్ డ్రెస్ యూనిఫా మ్స్ను అందజేశారు.
దాతల సహకారం వల్లే..
మా పాఠశాల ఉపాధ్యాయులతో పాటు దాతల సహకారం ఎంతో ఉంది. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సహాయ పడుతున్నారు. పిల్లల్లో మార్పులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో పాటు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇటీవల నూతనంగా అమలు చేస్తున్న బాలసభ, కలర్ డ్రెస్ యూనిఫామ్స్ వల్ల పిల్లల్లో బాధ్యత, క్రమశిక్షణ పెరుగుతోంది.
– టీ కవిత, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు