జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య చేరువైంది. జిల్లాలోని గణపురం మండలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మెడికల్ కళాశాలలో సీటు దక్కింది. ఎంసెట్లో లక్షా 64 వేలకు పైగా ర్యాంకు వచ్చినా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు పదిలమైంది. 2014కు ముందు సమైక్య పాలనలో కళాశాలల కొరతతో 30 వేల ర్యాంకు వచ్చినా సీటు లభించకపోయేది. ఇతర ప్రైవేట్ కళాశాలల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్య విద్యను అభ్య సించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో 21 ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరికొన్ని కళాశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. దీంతో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల కల నెరవేరి పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య చేరువైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో స్వరాష్ట్ర పేద విద్యార్థులకు సీట్లు దక్కాయి.
సొంత జిల్లాలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం పరశురాంపల్లికి చెందిన వీరగోని అశోక్, శైలజ దంపతుల కొడుకు వేణుకు మెడిసిన్లో సీటు వచ్చింది. అదీ సొంత జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే కావడం గమనార్హం. అశోక్, శైలజ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వేణు, చిన్న కొడుకు రామకృష్ణ. కులవృత్తి అయిన గీత కార్మిక పని చేసుకుంటూ ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. వేణును డాక్టర్ చేయాలనేది తల్లిదండ్రుల ఆశయం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇద్దరు కొడుకులను గణపురంలోని మోడల్ స్కూల్లోనే చదివించారు. వేణు మోడల్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాక హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ఎంసెట్లో 1,64,564 ర్యాంకు వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు రావడం కష్టం అనుకున్నారు. కానీ, వెతకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా సొంత జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు లభించింది. దీంతో విద్యార్థి, అతడి కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సీటు రాకుంటే భూమి అమ్మేటోన్ని : అశోక్, శైలజ విద్యార్థి తల్లిదండ్రులు
నా కొడుకు వేణు మంచిగ చదువుతడు. స్థోమత లేక 10 పదో తరగతి దాక సర్కారు బడిలనే సదివించిన. 11,12 తరగతులను హన్మకొండల తక్కువ ఫీజు మాట్లాడుకొని ఎట్లనో గట్ల ఎల్లదీసిన. మళ్ల డాక్టర్ కోచింగ్ అని హైదరాబాద్ పోయిండు. అప్పోసప్పో చేసి పంపిన. వాన్ని ఎలాగైనా డాక్టర్గా సూడాలని మా కోరిక. ఉన్న రెండెకరాల భూమిల ఎవుసం చేసుకుంట, తాళ్లు ఎక్కి కల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంట కొడుకులను సదివించిన. మా జిల్లాలోని సర్కారీ కాలేజీలో సీటు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రైవేటుల వత్తది కావచ్చు అనుకున్నం. ప్రైవేటుల వత్తె భూమి అమ్మి అయినా సదివిత్త అనుకున్న. కానీ, సీఎం కేసీఆర్ దయ వల్ల నా కొడుక్కు సర్కారు కాలేజీలనే సీటు వచ్చింది. తెలంగాణలో కొత్తగా కాలేజీలు పెట్టడం వల్లే మా లాంటి పేదోళ్లకు సర్కారు కాలేజీల్లో సీట్లు వత్తన్నయ్. కేసీఆర్ కొత్త కాలేజీలు పెట్టకపోతే నా కొడుక్కు సీటు రాకపోయేది. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఇసొంటి సీఎం ఉండాలె. నా కొడుకును డాక్టర్గా సూడాలనే మా కలను నెరవేర్చిండు. చాలా సంతోషంగున్నది.
వేణు క్లెవర్ స్టూడెంట్ : సుమన్, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, గణపురం, జయశంకర్ జిల్లా
వేణు క్లెవర్ స్టూడెంట్. మా స్కూల్లోనే 10వ తరగతి వరకు చదివాడు. జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వేణుకు సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్ డాక్టర్ కాబోతున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం అంటే చాలా మందికి చిన్న చూపుగా ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు, అనుభవం ఉన్న టీచర్లు ఉంటారు. సీఎం కేసీఆర్ విద్యారంగం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి.
కొత్త కాలేజీలతోనే సీటు : వేణు, విద్యార్థి
రాష్ట్రంలో కొత్త కాలేజీలు ఏర్పాటు చేసి తెలంగాణలోని విదార్థులకు 85 శాతం సీట్లు కేటాయించేలా జీవో తీసుకురావడం కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ప్రభుత్వ కళాశాలలను అక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. కేవలం తెలంగాణ లోనే 21 ప్రభుత్వ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణకు చెందిన చాలా మంది విద్యార్థులకు సీట్లు వచ్చినయి. నా లాంటి పేదోళ్లకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు రావడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. నాకు 1,64,564 ర్యాంకు వచ్చింది. ప్రైవేటు కాలేజీలో సీటు వస్తుందేమో అనుకున్న. రెండు, మూడో రౌండ్లలో ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తుందోమోననే ఆశ ఉండె. కానీ నాకు మొదటి రౌండ్లోనే సీటు వచ్చింది. అదీ కూడా సొంత జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే. సీఎం కేసీఆర్ వల్లే నా కల, నా తల్లిదండ్రుల కల నెరవేరింది. సారుకు రుణపడి ఉంటాం.