మహదేవపూర్, అక్టోబర్ 2 : గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రత్యేక నిధులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం ‘పల్లె ప్రగతి’ని పక్కా అమలుచేసి సకల సౌకర్యాలు సమకూర్చడంతో పరిసరాలన్నీ కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు అతీగతీ లేక వెలవెలబోయిన ఊరు.. ఇవాళ సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో మెరిసిపోతున్నది.
గ్రామ సర్పంచ్ పద్మారవీందర్రెడ్డి ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహించడంతో పాటు వారి సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను పక్కాగా వినియోగిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించే గ్రామసభల ద్వారా చేపట్టబోయే పనులపై ఇటు పాలకవర్గం, ప్రజలతో చర్చించి పారదర్శకంగా పనులను చేస్తున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగసామ్యం కావాలని సర్పంచ్ ప్రజలకు అవగాహన కల్పించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. అంతేగాక ఊరి బాగు కోసం గ్రామ ప్రజలు సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బొమ్మాపూర్ అన్నింటా ప్రగతి సాధించింది. పల్లె ప్రగతి కార్యక్రమ అమలు సహా గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రోత్సహిస్తుండడంతో సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు శిథిల భవనాలు, చెత్తాచెదారంతో నిండిన డ్రైనేజీ, అడుగడుగునా గతుకుల రోడ్లతో దర్శనమిచ్చిన ఊరు ఇప్పుడు అద్దంలా మెరుస్తూ హరితశోభను సంతరించుకున్నది. ఎటుచూసినా పరిశుభ్రమైన వాతావరణం, ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతివనాలు, దారుల వెంట హరితహారం మొక్కలతో సరికొత్త అనుభూతినిస్తూ ‘బొమ్మాపూర్ సూపర్’ అనేలా కనిపిస్తోంది. జీపీ పాలకవర్గం, అధికారుల ప్రత్యేక శ్రద్ధ, ప్రజల భాగస్వామ్యంతో ప్రగతిలో దూసుకుపోతోంది.
– మహదేవపూర్, అక్టోబర్ 2
సర్కారు ఇచ్చే నిధులతో గ్రామంలో చెత్త సేకరణ, వాటరింగ్ కోసం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. అలాగే సువిశాలమైన రహదారులు వేశారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ భనవం శిథిలావస్థలో ఉండగా నూతన హంగులతో కొత్తది నిర్మించారు. ఇందులో ప్రత్యేక గదులు, ఫర్నిచర్, ఆర్చీ గేట్, ప్రహరీ నిర్మించి వాల్రైటింగ్ వేయించారు.అలాగే గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పచ్చదనంతో ఆకట్టుకుంటోంది. ప్రధాన కూడలిలో ఎల్ఈడీ హైమాస్ట్ లైట్లు అమర్చడంతో గ్రామానికి కొత్త వెలుగు వచ్చింది.
ఇక ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, పల్లె, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, చుట్టూ ఫెన్సింగ్, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ప్రజలకు ఉచితంగా చెత్త బుట్టల పంపిణీ, డ్రైనేజీల నిర్మాణం, గ్రామంలో పల్లె దవాఖాన మరమ్మతులు చేయించడంతో ఇబ్బందులు తీరాయి. గ్రామంలో ఎప్పటికప్పుడు జీపీ ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారం సేకరించి డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలను త్వరతగతిన పరిష్కరిస్తున్నారు. ఇలా నాడు సౌకర్యాలు లేక ఇక్కట్లు పడ్డ ప్రజలు.. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సకల సదుపాయాలు అందుబాటులోకి రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు
గ్రామంలో ప్రభుత్వ నిధులతో ప్రజల సౌకర్యం కోసం విశాలమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. నాడు ఇరుకైన రోడ్లతో ఇబ్బంది పడ్డ ప్రజలు నేడు విశాలమైన రోడ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను ప్రత్యేక చొరవతో సంరక్షించడంతో పచ్చని చెట్లుగా మారి బాటసారులకు, గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ప్రజల సహకారం వల్లే..
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా బొమ్మాపూర్ ఎంతో మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు జీపీ ట్రాక్టర్తో చెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్డు కు తరలించి వ్యర్థాలు, తడి చ్తెతతో సేంద్రియ ఎరువును తయారు చేస్తూ విక్రయిస్తూ జీపీకి అదనపు ఆదాయం తెస్తున్నాం. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలతో గ్రామంలో పచ్చదనం నెలకొంది. ఇటీవల జిల్లా స్థాయిలో స్వచ్ఛ్ సర్వేక్షణ్లో అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల సహకారంతోనే జరిగింది. గ్రామ అభివృద్ధిలో భాగం అవుతున్న ప్రజలకు ప్రత్యేక కృతఙ్ఞతలు.
– ఓడేటి పద్మారవీందర్రెడ్డి, సర్పంచ్, బొమ్మాపూర్
ఊరు ఎంతో మారింది..
మా ఊరిలో అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. హరితహారం మొక్క లు, ప్రకృతి వనాలు, విశాలమైన రోడ్లు, హైమాస్ట్ లైట్లతో రూపురేఖలే మారిపోయినయ్. అధికారులు గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిత తర్వాతే అభివృద్ధి కనిపిస్తాంది. ఇంటంటికీ చెత్త బుట్టలు ఇచ్చారు. రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నరు. మాకు చాలా సంతోషంగా ఉంది.
– మల్లెల మోహన్, గ్రామస్తుడు