మహబూబాబాద్/డోర్నకల్, డిసెంబర్ 7: రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్డులోని జిల్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో నిర్మిస్తున్న నర్సింగ్, మెడికల్ కాలేజీ భవనం, సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ 15వ ప్యాకేజీలో భాగంగా డోర్నకల్లో మున్నేరువాగుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ నిర్మాణ పనులను కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందుతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.
ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ రెండు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు డోర్నకల్ మండలం వెన్నారం వరకు సాగునీరు అందుతోందని వివరించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం కోరిన వెంటనే తమ భూములను ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నీళ్లు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణ ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వడం సీతారామ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు.
రైతులకు చివరి ఆయకట్టు వరకు తెలంగాణ ప్రభుత్వం నీరు అందిస్తుందన్నారు. ప్రాంత ప్రజలు, మిర్చి పంట పండిస్తున్న రైతుల కోసం పరిశ్రమలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మరిచిపోయారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలులో మోదీ అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. మానుకోటలో నిరుపేదలకు పూర్తి స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో ఏ పార్టీ వారైనా తిరగవచ్చని, తమ స్థాయికి తగ్గట్టు ఉపన్యాసం ఇస్తే తప్పు లేదని, కానీ సీఎం కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడితే ఇక్కడి ప్రజలు ఊరుకోరని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఉద్దేశించి మంత్రి సత్యవతి వ్యాఖ్యానించారు. విభజన హామీలైన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సమ్మక్క – సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినా కేంద్రానికి పట్టలేదన్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ ద్రోహుల కుటుంబ సభ్యురాలని, ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మానుకోట రాళ్లకు, ఇక్కడి ప్రజలకు చాలా పౌరుషం ఉందన్నారు. కార్యక్రమాల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, సీఈ శంకర్నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ రమేశ్రెడ్డి, డోర్నకల్ తహసీల్దార్ స్వాతి బిందు, గార్ల తహసీల్దార్ రాము, సర్పంచ్ బాణోత్ పాండునాయక్, టీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి హనుమ, తాళ్లూరి రామయ్య, మల్లం అనిల్, బిక్కసాని రామకృష్ణ, మైనుపాషా పాల్గొన్నారు.