చారిత్రక ఓరుగల్లులో పారిశ్రామిక ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ శరవేగంగా విస్తరిస్తుండడంతో ఇక్కడ అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నది. ఈ క్రమంలోనే కాకతీయ మెగాటైక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టగా ఇక్కడ పరిశ్రమల స్థాపన కోసం మంత్రి కేటీఆర్ చొరవతో ప్రముఖ దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ఐటీ రంగం కూడా దినదినాభివృద్ధి చెందుతుండగా, నగరంలో పారిశ్రామిక రంగానికి మరింత తోడ్పాటునందించేందుకు ఎన్నో ఏళ్ల డిమాండ్గా ఉన్న మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు ఉన్న భూమికి తోడు అదనంగా మరో 253 ఎకరాలు కావాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కోరగా, ఆ మేరకు భూమిని అప్పగించేందుకు ముందుకొచ్చింది. ఎయిర్పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టువదలకుండా కృషి చేస్తుండడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరంగల్ వాసుల గగనయాన కల త్వరలోనే నెరవేరనున్నది.
– వరంగల్, ఆగస్టు 3 (నమస్తేతెలంగాణ)
వరంగల్, ఆగస్టు 3(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్. చారిత్రక ఓరుగల్లు శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టింది. సమైక్య పాలనలో వరంగల్లోని ఆజంజాహి మిల్లు మూతపడడంతో సీఎం కేసీఆర్ గీసుగొండ, సంగెం మండలాల సరిహద్దులోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద వస్త్ర నగరి నిర్మిస్తున్నారు. సు మారు 1,200 ఎకరాల విస్తీర్ణంలోని ఈ పార్కులో ఇప్పటికే గణేశా కంపెనీ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. టీఎస్ఐఐసీ ‘మెగా’ పార్కులో ఈ కంపెనీకి యాభై ఎకరాలను కేటాయించింది.
ఈ స్థలంలో గణేశా ఎకో టెక్, ఎకో పెట్ యూనిట్ల నిర్మాణం చేపట్టగా, ఒక యూనిట్ లో ఏడాది క్రితం ఉత్పత్తి మొదలైంది. 2022 మే 7న మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. అదేరోజు భూమి పూజ చేసిన కిటెక్స్ కంపెనీ దశల వారీగా ఉత్పత్తిని ప్రా రంభించేందుకు ఇక్కడ ఆరు యూనిట్ల నిర్మాణ పనులు చేపట్టింది. త్వరలో కిటెక్స్లో కూడా ఉత్పత్తి ప్రారంభం కానుంది. తాజాగా సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఈ పార్కులో రూ.840 కోట్లతో వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దీనికి టీఎస్ఐఐసీ ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. జూన్ 17న మంత్రి కేటీఆర్ కంపెనీ వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. తమ వస్త్ర పరిశ్రమల ద్వా రా ప్రత్యక్షంగా 11,700 మందికి, పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి కలగనుందని యంగ్వన్ కం పెనీ ప్రకటించింది. వేలాది మందికి ఉపాధి కల్పించను న్న కంపెనీలు ఈ పార్కులో వస్త్ర పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రావడం వెనుక మంత్రి కేటీఆర్ చొరవ ఉంది. ఇక్కడ పెట్టుబడులను పెట్టేందుకు ఈ కంపెనీలను ఒప్పించడంలో ఆయనది కీలకపాత్ర. జూన్ 17న కేటీఆర్, యంగ్వన్ కంపెనీ చైర్మన్ హెలిక్యాప్టర్లలో ‘మెగా’ పార్కుకు వచ్చారు.
ఎయిర్పోర్టుపై దృష్టి..
వరంగల్ను పారిశ్రామికంగా పరుగులు పెట్టించే దిశ గా మంత్రి కేటీఆర్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ ఐటీ రంగాన్ని కూడా విస్తరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మామునూ రు ఎయిర్పోర్టుపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఎయిర్పోర్టును కోరుకుంటున్నారు. దీనికితోడు వరంగల్లో ఎయిర్పోర్టును పునరుద్ధరించాలనేది వరంగల్ వాసుల చిరకాల కోరిక. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ఈ ఎయిర్పోర్టును పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వా న్ని కోరింది. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రికి లేఖలు కూడా రాసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఫలితంగా మామునూరు ఎయిర్పోర్టు పు నరుద్ధరణ మరో 253 ఎకరాలు కావాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. రన్వే విస్తరించాల్సి ఉన్నందున భూమిని అప్పగిస్తే ఎయిర్పోర్టు పునరుద్ధర ణ సాధ్యం అవుతుందని వెల్లడించింది. దీంతో 2022 మే 7న మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మామునూ రు ఎయిర్పోర్టు స్థలాన్ని సందర్శించారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు రూపొందించిన మ్యాప్ను పరిశీలించారు. సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
భూమి అప్పగింతకు నిర్ణయం..
నిజాం కాలంలో మామునూరు కేంద్రంగా ఎయిర్పోర్టు పనిచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టుకు 696 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిసింది. మరో 253 ఎకరాల భూమి సేకరించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కొద్ది నెలల క్రితం సర్వే నిర్వహించారు. ఎయిర్పోర్టును ఆనుకుని ఉన్న నక్కలపల్లి, గాడిపల్లి తదితర గ్రామాలకు చెందిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు హద్దులు కూడా ఏర్పాటు చేశారు. ఏ రై తు నుంచి ఎంత భూమిని సేకరించాలనే వివరాలను స ర్వే, ఖాతా నంబర్ వారీగా పేర్కొంటూ నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇటీవల కలెక్టర్ ప్రావీణ్య కూడా మా మునూరు ఎయిర్పోర్టును సందర్శించారు.
సేకరించాల్సిన 253 ఎకరాల్లో 217 ఎకరాలు పట్టా ల్యాండ్, 9 ఎకరాలు డెయిరీఫామ్కు సంబంధించినది ఉండగా, 20 ఎకరాలు కుంట శిఖం, 4 ఎకరాల రోడ్డు ఉంది. ఈ భూ మికి బదులు ప్రత్యామ్నాయంగా సమీపంలో పశుసంవర్ధక శాఖ ఆధీనంలో ఉన్న భూమిని ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ 253 ఎకరాల్లో వరంగల్లోని గవిచర్ల క్రాస్రోడ్డు నుంచి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారి కూడా కొంత ఉన్నది. దీన్ని ఎయిర్పోర్టుకు అప్పగించిన తర్వాత ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎయిర్పోర్టుకు 253 ఎకరాల భూమిని అప్పగించాలని తీర్మానించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ మొదలు కానుంది. మామునూరు ఎయిర్పోర్టును పునరుద్ధరించాలనే వరంగల్ ప్రజల కల సాకారం కాబోతున్నది.