కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి.. సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పనిచేసి.. రాజకీయాల్లో ఎంతోమంది నేతలకు గురువై.. తెలంగాణ తేజమై నిలిచిన నూకల రాంచంద్రారెడ్డికి రాష్ట్ర సర్కారు గుర్తింపునిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు బీఆర్ఎస్ సర్కారు గౌరవాన్నిచ్చింది. ఇటీవలి మానుకోట పర్యటనలో భాగంగా స్వస్థలం మహబూబాబాద్తో పాటు వరంగల్ జిల్లా కేంద్రంలో నూకల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి పాలనలో ఏ ప్రభుత్వాలు కూడా రాంచంద్రారెడ్డికి సరైన ప్రధాన్యాత ఇవ్వలేదని, ఆయన గొప్పతనాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారని నూకల కుటుంబసభ్యులు, అభిమానుల్లో కృతజ్ఞతాభావం కనిపిస్తున్నది.
వరంగల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో గుర్తింపునకు నోచుకోని రాజకీయ ప్రముఖులు, తెలంగాణవాదులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలకు గుర్తింపునిచ్చి గౌరవించింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నూకల రాంచంద్రారెడ్డి పేరును ఒక పెద్ద సంస్థకు పెట్టడంతో పాటు మహబూబాబాద్, వరంగల్లో ఆయన కాంస్య విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం విశేషం. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లికి చెందిన నూకల రాంచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నేతగా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.
మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. రాజకీయాల్లో ఎంతోమంది నేతలకు గురువుగా నిలిచారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్లో ముఖ్యనేతగా పనిచేసిన ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. గతంలో డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నూకల రాంచంద్రారెడ్డి స్వగ్రామమైన జమాండ్లపల్లి.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాణి వినిపించిన నూకల రాంచంద్రారెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది సీఎం కేసీఆర్ నూకల రాంచంద్రారెడ్డి మనుమరాలైన కూచిపూడి నర్తకి దీపికారెడ్డిని సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా నియమించారు.
ఆయన నిర్ణయంపై నూకల రాంచంద్రారెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వెలిబుచ్చారు. సీఎం కేసీఆర్ గురువారం తన మహబూబాబాద్ పర్యటనలో నూకల రాంచంద్రారెడ్డిని మహనీయుడిగా అభివర్ణించారు. ‘పీవీ నర్సింహారావు చాలామందికి గురువు. కానీ, నూకల రాంచంద్రారెడ్డి పీవీ నర్సింహారావుకే గురువు. గొప్ప మేధావి. పట్టుదల ఉన్న వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా నూకల రాంచంద్రారెడ్డి చాలా అద్భుతంగా పనిచేసిన వ్యక్తి. ఒకరోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పీవీకి ఇవ్వకపోతే నేను తీసుకోను అన్నాడు.
ఎందుకు తీసుకోవంటే ఈ పిల్లవాడిలో స్పార్క్ ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడైతడు. ఇక్కడే చిదిమేయకండి. మీరు అతనికి ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్పిండు. ఇద్దరికి ఒకసారి ఇస్తేనే తీసుకుని పనిచేసిన వ్యక్తి. అతని దీవెనతో పీవీ నర్సింహారావు ఎక్కడిదాకా వచ్చా డో ఇప్పుడు అందరికీ తెలుసు. భారతదేశానికి పీవీ ప్రధానమంత్రి కావ డం కళ్లారా చూసినం’ అని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నా రు. అంత పటిష్టమైన ఆలోచన, అంత ముందుచూపు ఉన్న దీర్ఘదర్శి, మహనీయుడు నూకల రాంచంద్రారెడ్డి అని కొనియాడారు. ‘సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ తేజాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నేను మీ అందరి మధ్య గర్వంగ ప్రకటిస్తున్న.
వారి స్మారకార్థం ఒక పెద్ద సంస్థకు రాబోయే రోజుల్లో ఆయన పేరు పెట్టుకుందాం. చిరస్థాయిగా ఉండేలా వారి స్వగ్రామం ఇక్కడికి నాలుగు కి.మీ దూరంలోనే ఉన్నందున మహబూబాబాద్లో బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా నూకల రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘ఈ గడ్డ మీదికొచ్చి నూకల పేరు స్మరించుకోకపోతే మన సభ సంపూర్ణం కాదు. ఆ మహనీయుడిని స్మరించుకుందాం.. నివాళులర్పిద్దాం’ అని గుర్తుచేయడంతో పాటు యావత్ తెలంగాణకు సూచించారు.
మానుకోట సభలో నూకల ప్రస్తావన తేవడంతో పాటు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుందామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఉమ్మడి జిల్లాలోని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూకల కుటుంబసభ్యుల్లోనూ ఆనందం వ్యక్తమవుతున్నది. రెండు రోజులుగా ఈ అంశంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఏ సంస్థకు ఆయన పేరు పెడుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయ గురువుగా వెలుగు వెలిగిన రాంచంద్రారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చిందని రాజకీయ ప్రముఖుల్లోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.