పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనుల ఎన్నో ఏండ్ల కల నెరవేర్చిన రాష్ట్ర సర్కారు.. వాటిని సాగుకు యోగ్యంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు సీఎం గిరివికాస్ పథకం కింద సదరు భూములకు విద్యుత్ సౌకర్యం, సాగునీటి వసతి కల్పించి దిగుబడి పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్లో 38 మండలాల్లో ఉన్న 37,987 మంది గిరిజనులకు 1,02,256 ఎకరాలకు గాను హక్కు పత్రాలు ఇవ్వగా ఆ భూములు ఏమేరకు సాగుకు పనికి వస్తాయో.. ?ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయమై సర్వే చేయాలని ఐటీడీఏకు ఆదేశాలిచ్చింది. ఈమేరకు ఐదు జిల్లాలవారీగా బడ్జెట్ అంచనాలు రూపొందించి అన్ని శాఖల వెరిఫికేషన్ తర్వాత అవసరమైన చోట త్రీఫేస్, ల్యాండ్ డెవలప్మెంట్, బోర్లు, విద్యుత్ మోటార్లు తదితర ఏర్పాట్లు చేయనున్నది. ఫలితంగా గిరి ప్రాంతాల్లో రైతులు కేవలం ఆరుతడి సాగుకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలు వేసేలా తోడ్పాటు అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చనున్నది. – ఏటూరునాగారం, సెప్టెంబర్ 10
ఏటూరునాగారం, సెప్టెంబర్ 10 : ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రైతుబంధు కూడా అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 38 మండలాల్లో 402 గ్రామ పంచాయతీల పరిధిలో 748 గ్రామాలకు చెందిన 37,987 మంది గిరిజనులకు 1,02,256 ఎకరాల భూములకు ప్రభుత్వం ఈ ఏడాది పోడు భూములపై హక్కులు కల్పిస్తూ పత్రాలు పంపిణీ చేసింది. ఆయా భూములకు విద్యుత్ సౌకర్యం, సాగు నీటి వసతిని సీఎం గిరివికాస్ పథకం కింద కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక హక్కు పత్రాలు ఇచ్చిన భూములు సాగుకు ఏమేరకు యోగ్యంగా ఉన్నాయో తెలియకుండా ఉంది.
సరైన సాగునీటి వసతి లేకపోవడంతో పోడు సాగు చేసుకుంటున్న అనేకమంది గిరిజనులు ఆరుతడి పంటలు మాత్రమే పండిస్తున్నారు. పోడు భూముల్లో వ్యవసాయ వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. పోడు భూముల్లో పంటలు పండించేందుకు అవసరమైన బోర్లు, విద్యుత్ సౌకర్యం కూడా అవసరమని భావించింది ప్రభుత్వం. అసలు ఎన్ని గ్రామాలకు, ఎన్ని ఎకరాల భూములకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉంది. కరెంటు లేకుండా ఉన్న గ్రామాలు ఎన్నో కూడా లెక్క తేల్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
కేవలం పట్టాలకే పరిమితం చేయకుండా సాగుకు యోగ్యంగా భూములను మరల్చేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం, అవసరమైతే ల్యాండ్ డెవలప్మెంట్(లెవలింగ్) చేయడం, బోర్లు వేయడంతో పాటు విద్యుత్ మోటార్లు ఇవ్వడం లాంటివి చేపడితేనే రైతుకు న్యాయం చేసినట్లు అవుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఐటీడీఏలకు ఆదేశాలు జారీచేసింది. ఎన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. లేకుంటే ఎంతదూరం నుంచి ఆయ భూమికి లైన్ వేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమయ్యే ఖర్చు ఎంత. ఒకవేళ విద్యుత్ సౌకర్యం ఆయా గ్రామాలు కలిగి ఉంటే హక్కు పత్రాలు పొందిన రైతుల భూముల్లో వ్యవసాయ బోర్లను మంజూరు చేయడం, వ్యవసాయ బోర్లు ఉంటే వారికి కరెంటు మోటార్లు మంజూరు చేయడం లాంటి ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు సత్వరమే నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించింది.
పారదర్శకంగా అమలుకు ఐటీడీఏకు అజమాయిషీ
గతంలో ఐటీడీఏకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డీఆర్డీఏకు మంజూరు కోసం పంపించేవారు. దీంతో డీఆర్డీఏ ద్వారా బోర్లు, మోటార్లు మంజూరు చేశారు. మోటార్లు కొనుగోలు, బోర్లు వేయడంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతుల నుంచి అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమాలకు ఈసారి తావివ్వకుండా ఐటీడీఏ ఆజమాయిషీ ఉండేలా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక వీటిని మంజూరు చేసే ముందు క్షేత్రస్థాయిలో సర్వే పారదర్శకంగా చేపట్టనున్నారు. బోరువెల్ యూజర్ గ్రూపులను తయారు చేయనున్నారు. ఒక గ్రూపు పరిధిలో పది ఎకరాలకు మించకుండా కనీసం ముగ్గురు రైతులు ఉండేలా గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల వెరిఫికేషన్ తర్వాత ఫిజుబిలిటీ సర్టిఫికెట్ ఉంటే నిధులు మంజూరు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో మోటార్లు మంజూరు చేయడం, ల్యాండ్ డెవలప్మెంట్ చేయడం లాంటివి చేపట్టనున్నారు. పెద్ద మొత్తంలో ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి పర్చేందుకు గిరివికాస్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలవారీగా అంచనాలకు ఆదేశాలు
ఇక ఆయా జిల్లాలవారీగా అవసరమైన బడ్జెట్ కేటాయించేందుకు అంచనా వేయాల్సి ఉంది. దీంతో జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు, ఎన్పీడీసీఎల్ అధికారులను భాగస్వామ్యం చేసి సర్వేతో పాటు విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈమేరకు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ఐటీడీఏ పీవో అంకిత్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ని గ్రామాలకు ప్రస్తుతం త్రీఫేస్ సౌకర్యం ఉంది. ఎన్ని వ్యవసాయ భూములకు ఉంది. ఎన్ని గ్రామాలకు త్రీఫేస్ అవసరం ఉంది. గ్రామాల నుంచి పంట భూముల వరకు త్రీఫేస్ కరెంటు ఎంతదూరంలో ఉంటాయనే వివరాలను వెంటనే అందించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు సంబంధిత అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రస్తుతం హక్కు పత్రాలు జారీ చేసిన భూముల్లో ఎలాంటి సేద్యం జరుగుతున్నదనే సమాచారం కూడా సేకరించనున్నారు. గతంలో ఐటీడీఏ పోడు భూములు, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను బ్లాకుల వారీగా గుర్తించి బోర్వెల్స్, ట్యూబ్వెల్స్, విద్యుదీకరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 2,623 మంది లబ్ధిదారులను గుర్తించి రూ.18.92కోట్లు ఖర్చు చేశారు. ఇక ఇదే తరహాలో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.02లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు
ములుగు జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 118 గ్రామ పంచాయతీల్లో 195 గ్రామాలకు చెందిన 6772 మంది రైతులకు 17,320 ఎకరాలకు హక్కు పత్రాలను అందచేశారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది మండలాల్లోని 92 గ్రామ పంచాయతీల పరిధిలో 164 గ్రామాలకు చెందిన 3,210 మంది రైతులకు 7,892 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 152 గ్రామ పంచాయతీల పరిధిలోని 320 గ్రామాలకు చెందిన 24664 మంది రైతులకు 69,645 ఎకరాలు, వరంగల్ జిల్లాలోని ఐదు మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల పరిధిలోని 64 గ్రామాలకు చెందిన 3271 మంది రైతులకు 7333 ఎకరాలు, హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన 70 మంది రైతులకు 64 ఎకరాలకు హక్కు పత్రాలు అందచేశారు. వీటికి వెంటనే రైతుబంధు కూడా రైతుల ఖాతాలో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నారు. రైతుబంధు ఇస్తే సరిపోదనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం భూములను కూడా సాగులోకి తీసుకరావడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే గిరి వికాస్ పథకాన్ని అమలు చేయనున్నది. భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి, బోర్లు మోటార్లు అందజేస్తే పంటల దిగుబడి కూడా క్రమేపీ పెరుగనున్నది.