జయశంకర్ భూపాలపల్లిలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మెయిన్ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఈమేరకు అవసరమైన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్, ఇతర శాఖల వారీగా అంచనాలను రూపొందించారు. రోడ్లు, కల్వర్టులు, లో లెవల్ బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టనున్నారు. మహదేవ్పూర్ మండలంలో తెగిపోయిన పెద్దంపేట వాగు అప్రోచ్ రోడ్డు తాత్కాలిక మరమ్మతులు ఇప్పటికే పూర్తి చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద ఉధృతికి రోడ్లు కొన్నిచోట్ల కొట్టుకుపోగా, మరికొన్నిచోట్ల దెబ్బతిని తెగిపోయాయి. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా మరమ్మతులు చేయనున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఉప్పొంగిన వరదలు ప్రస్తుతం తగ్గడంతో మరమ్మతులకు ఉపక్రమించారు.
అంచనాలు రెడీ..
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో రూ.6కోట్ల మేర రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.1.39కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.13.40కోట్లు అవసరమని అధికారులు అంచనాలను రూపొందించారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రోడ్లు, కల్వర్టులు, లో లెవల్ వంతెనలకు రూ.12.19కోట్లు వాటిల్లగా తక్షణమే రూ.12.19కోట్లతో తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత మరమ్మతులు రూ.58.70కోట్లతో చేయనున్నారు. జాతీయ రహదారి 353సీ పరకాల నుంచి కాళేశ్వరం వరకు పెద్ద గుంతలు పడగా తాత్కాలిక మరమ్మతులకు రూ.15కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.1.5కోట్లతో పనులను చేపట్టనున్నారు.
ప్రజారవాణా స్తంభించకుండా..
జిల్లాలో వర్షాలకు వేమనపల్లి నుంచి మహాముత్తారం ప్రధాన రహదారి దెబ్బతినగా, కాటారం – మేడారం ప్రధాన రహదారి కేశపూర్ వద్ద తెగిపోయింది. వీటిని కలెక్టర్ భవేశ్మిశ్రాతో పాటు ఇంజినీరింగ్ అధి కారులు పరిశీలించారు. ప్రజారవాణా కోసం రాకపోకలు జరిగేలా తాతాలిక మరమ్మతులను ఆర్ అండ్ బీ అధికారులు చేపడుతున్నారు. మహదేవ్పూర్ మండలం పెద్దంపేట వాగు అప్రోచ్ రోడ్డు తెగిపోవటంతో తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేశారు.