పర్వతగిరి, జనవరి 21: పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు కృషి చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల ఇన్చార్జిలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శివాలయం ఎదురుగా ఉన్న పెద్ద చెరువు రిజర్వాయర్లో భక్తుల కోసం బోటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఆలయ పునఃప్రతిష్ఠాపనోత్సవానికి సుమారు లక్ష మంది భక్తులు హాజరు కానుండడంతో 200 మంది పోలీసు బృందంతో ఐదుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా కానిస్టేబుళ్లు, వందమంది కానిస్టేబుళ్లు, 60 మంది హోంగార్డులతోపాటు ప్రత్యేకంగా పది పోలీసు బృందాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
ఆలయ పునఃప్రతిష్ఠాపనలో భాగంగా గ్రామానికి చెందిన 19 మంది శివమాలలు ధరించారు. నిత్యం శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో భక్తిభావం ఉప్పొంగిపోతున్నది స్థానికలు అంటున్నారు. అలాగే, పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకునేలా వలంటీర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు.