తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ కోటలోని ఖుష్మహల్ మైదానంలో మంత్రి కొండా సురేఖ, ములుగులో మంత్రి సీతక్క, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ విప్లు రామచంద్రూనాయక్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్రెడ్డి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రులు సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కాగా, హనుమకొండలో విద్యార్థులు లేకపోవడంతో లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే నృత్యం చేశారు.
అలాగే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ కార్మిక, ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో వాడవాడలా జెండాలను ఎగురవేశారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకొని, వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా, వరంగల్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు నిరసన సెగ తాకింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర సాధన కోసం శ్రమించిన ఉద్యమకారులను ఆవిర్బావ దినోత్సవం రోజు పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.