విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత్ సేవలను వివరించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రంలో విద్యుత్ విజయం గొప్పదని అన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్నోళ్లు సర్కారుకు అండగా నిలవాలని కోరారు. దేశం తెలంగాణ మాడల్ను కోరుకుంటోందని, ప్రజలు కేసీఆర్ నాయకత్వం కావాలంటున్నారని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ పరిస్థితిపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అన్నారు. ఉర్సు బైపాస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కృషితో నిరంతర విద్యుత్ అందుతోందన్నారు. సబ్సిడీతో పేదలకు చేయూతనిస్తున్నారని కొనియాడారు.
నర్సంపేట రూరల్, జూన్ 5 : సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ద్వారకపేటలో విద్యుత్ విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చీకట్లో ఉన్న తెలంగాణలో నేడు సీఎం కేసీఆర్ వెలుగు నింపుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతులు గుండెపై చేయి వేసుకొని హాయిగా నిద్రిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరంటు మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టాలని చూడగా సీఎం కేసీఆర్ తిప్పికొట్టారని, దాదాపు సంవత్సరానికి రూ.10కోట్ల అదనపు భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తున్నదన్నారు. ఐపీడీఎస్ పథకంతో నర్సంపేట పట్టణంలో, నియోజకవర్గంలో రూ.10కోట్లతో ప్రతి ఊరికి, గల్లీకి నూతన ట్రాన్స్ఫార్మర్, తీగలు ఏర్పాటు చేశామన్నారు.
27 సబ్స్టేషన్ల ద్వారా కరంట్ సరఫరా అవుతున్నదని, కొత్తగా 14 సబ్స్టేషన్లు రానున్నాయని చెప్పారు. విద్యుత్ రంగంలో చాలా ప్రగతి సాధించామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లాలో రూ.300కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహార చెక్కులను అందించారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీ పీ సంపత్రావు, డీఈ సదానందం, ఏవో కోదాటి మా ధవరావు, ఏడీఈలు అమృనాయక్, ఐలయ్య, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో అంబాల శ్రీనివసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, ఎంపీపీలు మోతె కళావతి, కాట్ల కోమల, ఊడ్గుల సునీత, వేములపల్లి ప్రకాశ్రావు, కౌన్సిలర్ రామసహాయం శ్రీదేవి, టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్, ఎస్సై బొజ్జ రవీందర్, ఏఈలు పెద్ది రవళి, సుష్మ పాల్గొన్నారు.