ములుగు, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ)/వెంకటాపూర్ : ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి దౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్న నేపథ్యంలో అపూర్వ స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భద్రాచలం నుంచి నేరుగా మధ్యాహ్నం 3గంటలకు రామప్పకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకుంటారు. రాష్ట్రపతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు అపూర్వ స్వాగతం పలికిన తర్వాత హెలిప్యాడ్ నుంచి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఆలయానికి 30 కార్లు, జామర్లతో కూడిన ప్రత్యేక కాన్వాయ్లో రాష్ట్రపతి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
రాష్ట్రపతి ముర్ము.. తొలుత రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శిల్పకళా సౌందర్యాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత రామప్ప గార్డెన్లో ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకొని రిమోట్ ద్వారా ప్రసాద్ ప్రాజెక్టు కింద రూ.60 కోట్లతో చేపట్టే రామప్ప అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే రూ.15 కోట్లతో కామేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.అనంతరం సభా వేదిక వద్ద గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే సాంస్కృతిక ప్రదర్శనలను రాష్ట్రపతి తిలకించనున్నారు. సుమారు గంట పాటు సాగే రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. కార్యక్రమాల అనంతరం రాష్ట్రపతి హెలిక్యాప్టర్ ద్వారా సాయంత్రం 4గంటలకు హైదరాబాద్కు పయనమవుతారు.
రాష్ట్రపతి పర్యటనలో ముర్ముతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామప్పను సందర్శించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షిలేఖీ, రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే దనసరి అనసూయ, వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయానికి అర కిలోమీటర్ దూరంలో పశ్చిమ దిశగా మూడు హెలిప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు. మూడు రోజులుగా భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్లు ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు రామప్ప చుట్టుపక్కల ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. హెలిప్యాడ్ ప్రాంగణంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) అధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) విభాగం అధికారులు రామప్ప పరిసరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో 600మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఎస్డబ్ల్యూ ఎస్పీ నారాయణనాయక్, ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, ఇంటెలిజెన్స్ ఎస్పీ రంగనాథ భాస్కర్, ఏఎస్పీలు సుధీర్ రామ్నాథ్, అశోక్కుమార్తో పాటు ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్సైలు, 247మంది కానిస్టేబుళ్ల పాటు సివిల్, పీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఈమేరకు వారం రోజులుగా డాగ్స్వాడ్, బాంబుస్వాడ్లతో ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే రామప్ప చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మూడు స్పెషల్ పార్టీ బృందాలతో పాటు కేంద్ర బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు, ఏఎస్పీలు రెండు రోజులుగా రామప్పలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయంతో పాటు గార్డెన్ సరికొత్తగా తీర్చిదిద్దారు. గార్డెన్లోని పాత్వేలకు బ్రిక్ కెర్బ్ చేపట్టడంతో పాటు కొరియన్ గ్రాస్ వేసి సర్వాంగ సుందరంగా తయారుచేశారు. దారికి ఇరువైపులా అందమైన పూలు, చెట్ల కుండీలతో అలంకరించారు. ఆలయం చుట్టూ గార్డెన్ ప్రాంగణంలో తాత్కాలికంగా పాత్వేలు ఏర్పాటుచేశారు. చుట్టూ ఉన్న ఐరన్ గ్రిల్స్ ఫెన్సింగ్కు, టాయిలెట్స్, వాటర్ప్లాంట్లకు కలర్స్ వేయించారు. ఆలయంలో అక్కడడక్కడ ఉన్న గుంతలను ఇసుకతో పూడ్చారు. ప్రధానాలయంలో ఉన్న హుండీలను, ఇతర సామగ్రిని బయట రూమ్లో భద్రపరిచారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రామప్ప చుట్టూ జామర్ వాహనాలు అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి హెలిక్యాప్టర్ దిగిన సమ యం నుంచి తిరిగి వెళ్లే వరకూ ఆలయ పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ పనిచేయకుండా జామర్లు పనిచేస్తాయి. రామప్ప ఆలయంతో పాటు హెలిప్యాడ్, సరస్సు, పాలంపేట గ్రామం తదితర ప్రదేశాల్లో సెక్యూరిటీ బలగాలకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం ఆధ్వర్యం లో దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి కాన్వాయ్లో 34 వాహనాలు ఇందులో ఒక జీపు, ఒకటి ఫైర్, రెండు పోలీస్ స్టిక్కరంగ్ వాహనాలను జామర్, 29 తెలుపు రంగు వాహనాలతో కాన్వాయ్ ఏర్పా టు చేశారు. 34 శాఖలకు చెందిన 100మంది అధికారులు, 200మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.
రాష్ట్రపతి పర్యటన విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ కృష్ణ ఆదిత్య సహా అధికారులందరికీ మంగళవారం గార్డెన్లో డీఎంహెచ్వో అల్లం అప్పయ్య ఆధ్వర్యంలో కొవిడ్ టెస్టులు చేశారు. ఎవరికీ పాజిటివ్ రాలేదని అందిరికీ నెగటివ్ వచ్చిందని డీఎంహెచ్వో తెలిపారు.