హనుమకొండ/ వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 17 ;తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. హనుమకొండ పరేడ్ గ్రౌండ్, వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించిన రెండు జిల్లాల ఉత్సవాలకు చీఫ్ గెస్ట్లుగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హాజరై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సాధించిన ప్రగతి, సుపరిపాలనపై వివరించారు. హనుమకొండలో మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. విద్యార్థుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఊరూరా ‘సమైక్యతా’ సంబురం అంబరాన్నంటింది. ఆదివారం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా’ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల్లో ముఖ్య అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రగతిని శాఖల వారీగా వివరించి, మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. పలుచోట్ల జాతీయ జెండాలతో విద్యార్థులు తీసిన భారీ ర్యాలీలు ఆకట్టుకున్నాయి. సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. కాగా జనగామలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్లో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ములుగులో మండలి విప్ ప్రభాకర్రావు, జయశంకర్ భూపాలపల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.