జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/ మహదేవపూర్ ; జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గల లక్ష్మీబరాజ్ను శుక్రవారం రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. రాష్ట్ర నీటి పారుదలశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రారంభం మొదలు ఇప్పటివరకు గల పరిస్థితులను మంత్రులకు వివరించారు.
ముందుగా రాష్ట్ర మంత్రులు మధ్యాహ్నం 12:14గంటలకు మేడిగడ్డకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. కలెక్టర్ భవేశ్మిశ్రా, ఇరిగేషన్ అధికారులు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎల్అండ్టీ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రి శ్రీధర్బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈఎన్సీ మురళీధర్ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరగా ఆయన సుమారు రెండు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి రిపోర్టును గణాంకాలతో కళ్లకు కట్టినట్లు వివరించారు. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1,698 గ్రామాలకు నీరందించేందుకు 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీతో ప్రాజెక్టును నిర్మించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1.27 లక్షల కోట్ల అంచనా రూపొందించగా, ఇప్పటి వరకు రూ.93.87 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. లక్ష్మీబరాజ్లోని 7వ బ్లాక్లో 20వ పిల్లర్ కుంగిందని, దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించిందని, వారు అడిగిన వివరాలను తాము సమర్పించామని చెప్పారు. కుంగుబాటుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కొనసాగుతోందని, ప్రస్తుతం బరాజ్ వద్ద ఏజెన్సీ సంస్థ గ్రౌటింగ్ పనులు ప్రారంభించిందన్నారు. కాపర్ డ్యాం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 15 రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు.
19,20,21 పిల్లర్లను డైమండ్ కటింగ్తో తొలగించి కాంక్రీట్తో మళ్లీ నిర్మించేందుకు సంస్థ సన్నద్ధమవుతోందన్నారు. మూడు గేట్లను సైతం కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పవర్పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మంత్రుల బృందం విలేకరులతో కలిసి లక్ష్మీబరాజ్పైకి చేరుకుని పిల్లర్ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇంజినీర్, అధికారుల బృందం మంత్రులకు కుంగిన పిల్లర్ను, చేపట్టాల్సిన పనులను వివరించారు. అక్కడి నుంచి 4:30గంటలకు మంత్రుల బృందం హెలికాప్టర్ ద్వారా అన్నారం బరాజ్ వద్దకు వెళ్లారు. అన్నారం బరాజ్ వద్ద ఈఈ యాదగిరి వారికి స్వాగతం పలికి బరాజ్లోకి తీసుకెళ్లారు. బరాజ్లో ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లను మంత్రులకు చూపించారు. 2020లో చిన్న చిన్న బుంగలు వస్తే కెమికల్ గ్రౌటింగ్ చేసి తీసివేశామని వారికి తెలిపారు. 2021లో మళ్లీ సీపేజ్ రావడంతో అందులోంచి ఇసుక వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, బరాజ్ నుంచి నీటిని తీసివేస్తే పర్మినెంట్ పనులు చేస్తామని ఆప్కాన్ సంస్థ ప్రతినిధి మల్లికార్జున్రావు తెలిపారు. నీటిని తీసేసేందుకు రెండు రోజుల్లో అనుమతి ఇస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వారికి వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు హైదరాబాద్ వెళ్లారు.
ముంపు బాధితులను ఆదుకోవాలి : మంత్రి శ్రీధర్బాబు
కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని మంత్రి శ్రీధర్బాబు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించారు. ప్రాజెక్టు మూలంగా రైతుల పంటలే కాకుండా గ్రామాలు కూడా ముంపునకు గురవుతున్నాయన్నారు. కరకట్టల నిర్మాణాలు చేపట్టి ముంపు నుంచి కాపాడాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలతో ఆదుకోవాలని కోరారు. చిన్న కాళేశ్వరం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ సమస్య ఉందని, త్వరగా పరిష్కరించాలని విన్నవించారు. కార్యక్రమాల్లో ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.