ములుగు, మే 22 (నమస్తే తెలంగాణ)/ములుగురూరల్ : రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ములుగు కలెక్టరేట్ ఎదుట, జాతీయ రహదారిపై రైతుల పక్షాన ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందజేశారు. ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతితో కలిసి వెంకటాపురం మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెట్టుబడి సాయం సరిగ్గా అందించకున్నా రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు పండించారని అన్నారు.
ఈ సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ వారిని గాలికొదిలేసిందన్నారు. తరుగు, తాలు పేరులో క్వింటాలుకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు కట్టింగ్లు పెడు తుండడంతో రైతుల గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. రైతును రాజు చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికి బికారిని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కట్టింగ్లలో ఒక లారీకి రూ.20 వేల వరకు ఉంటే, అందులో రూ.10వేలు మంత్రికి వెళ్తున్నాయని ఆరోపించారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో 15 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రారంభించి 25 రోజులు దాటినా కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రైతుల కష్టాలను పట్టించుకొని పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ గదులకు పరిమితమయ్యారని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, నాయకులు మల్క రమేశ్, వి. భిక్షపతి, రమణారెడ్డి, జంపన్న, శ్రీనివాస్, సురేశ్, మహేశ్, ఎం. భిక్షపతి, సాగర్, శ్రీనివాస్, జగన్మోహన్రావు, యాదగిరి, వెంకన్న తదితరులు ఉన్నారు.