స్టేషన్ ఘన్పూర్, జనవరి 10: తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, పార్టీల నాయకులు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేవని సిగ్గుతో తలదించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 54మంది లబ్ధిదారులకు రూ.19.18లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు పథకాలతోపాటు ఆసరా పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.
తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు, యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో జిల్లాలోకో మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తూ, దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా చేసి పంజాబ్ కంటే అధిక దిగుబడులు తెలంగాణ రైతులు సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు వెయ్యి ఆశ్రమ పాఠశాలల్లో 6లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇవన్నీ చూడకుండా, తెలంగాణపై వ్యతిరేక భావాన్ని పెంచుకుని, కుట్ర పూరితంగా విమర్శిస్తే ప్రజలు తరిమికొడతారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు రాంబాబు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాజేశ్ నాయక్, నీల గట్టయ్య, ఎంపీటీసీలు బూర్ల లతా శంకర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, సర్పంచ్లు గాదె చంద్రయ్య, అనుమాల మల్లేశం, అనితా సుధాకర్ బాబు, అన్నెపు అశోక్, జనగాం యాదగిరి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.