‘నాడు తాగునీటి కోసం అరిగోసపడ్డం.. పంచాయతీ ట్యాంకర్లో తెప్పించినా బిందెడు నీళ్లు దొర్కక కష్టపడ్డం.. సీఎం కేసీఆర్ సారు సల్లంగుండ ఇప్పుడు మా ఊరిలోనే ప్రాజెక్టు కట్టించిండు. అప్పటికి, ఇప్పటికి మా ఊరు ఎంతో మారింది.. మా ఆయన త్యాగానికి ఫలితం దక్కింది’ అంటున్నది అమరుడు ముత్తినేని శ్రీనివాస్ భార్య మంజుల. తెలంగాణ సర్కారు తమ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నదని, తనకు కొలువు కూడా ఇచ్చి ఆసరా అయిందని వివరించింది.
లింగాలఘనపురం, జూన్ 28 : జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని 2010, జనవరి 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని వీధుల్లోకి వచ్చి తెలంగాణ నినాదాలు చేస్తూ నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే జనగామ, తర్వాత హైదరాబాద్ తరలించారు. అప్పుడు దవాఖానలో హరీశ్రావు, కేటీఆర్ తదితరులు వచ్చి శ్రీనివాస్ను పరామర్శించారు. చికిత్స పొందుతూ 2010, మార్చి 11న శ్రీనివాస్ తుదిశ్వాస విడిచాడు. ‘నమస్తే తెలంగాణ’ తరఫున రూ.25వేలు, మరో పర్యాయం రూ.5వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందింది. తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయం చేసింది. మంజులకు ఇరిగేషన్ శాఖ హనుమకొండ కార్యాలయంలో అటెండరుగా 2016, జూలై 1న కొలువు వచ్చింది. ప్రస్తుతం మంజుల జనగామ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నది. కుమారుడు ఉదయ్కిరణ్ వరంగల్లోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ఉషారాణి జనగామలోని గౌతమి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది.
‘గా రోజులు మళ్లీ రావద్దు.. తాగు, సాగు నీటి కోసం అరిగోస పడ్డం.. తాగునీటి కోసం వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లేటోళ్లం. అప్పుడు బావుల యజమానులతోటి గొడవలయ్యేవి. గ్రామ పంచాయతీ ట్యాంకర్తోని నీళ్లు సరఫరా చేసినా.. బిందెడు నీటికి కొట్లాడుకునేది. ఎవుసం చేయాలని ఆశపడ్డ రైతులకు నీళ్లులేక పంటలు ఎండిపోయేవి. కరంటు కష్టాలు చెప్ప వశం కాదు. సీఎం కేసీఆర్ వచ్చినంక మా ఊరికే సాగునీటి ప్రాజెక్టు వచ్చింది. నవాబుపేటలోనే రిజర్వాయర్ కట్టిండ్రు. ఇప్పుడు నీళ్ల గోస తీరింది. 24గంటలు కరంటు ఉంటాంది. నా భర్త త్యాగం వట్టిపోలేదు. ఆయన ఆత్మ బలిదానాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మాకు రూ.10లక్షలు ఇచ్చిండు. నాకు నీటిపారుదల శాఖలో ఉద్యోగం పెట్టించిండు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఇద్దరు పిల్లల పేరుమీద డిపాజిట్ చేసిన. సీఎం కేసీఆర్ మరోసారి కూడా సీఎం అవుతారు. ఆయనే గనక అమరుల కుటుంబాల గురించి ఆలోచించకుంటే మా గతెట్ల ఉంటుండెనో తలుచుకుంటెనే గుండె జల్లు మంటాంది. సీఎం కేసీఆర్కు మా జీవితాంతం రుణపడి ఉంటం.
– ముత్తినేని మంజుల, అమరుడు శ్రీనివాస్ భార్య