హనుమకొండ సబర్బన్, జనవరి 2 : గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుండడంతో ఇప్పటికే చిన్నచిన్న కిరాణా దుకాణాలు, బట్టల షాపులు దివాళా అంచున నిలబడ్డాయి. ఇప్పుడు కులవృత్తులపై కూడా కన్నేసిన కార్పొరేట్ సంస్థలు సెలూన్లు, లాండ్రీ షాపులను కూడా నెలకొల్పేందుకు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పెద్ద నగరాల్లో ఏర్పాటు చేశాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ ముందుకు నడిపిస్తున్నది. ఉద్యమ కాలం నుంచే కులవృత్తులవారు పడుతున్న కష్టాలను తెలుసుకున్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ సమాజంలో గౌరవంగా బతికేలా పలు పథకాలను ప్రవేశ పెడుతూ అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు, రజకులను విద్యుత్ బిల్లుల భారం నుంచి గట్టెక్కించారు. సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీగాట్లకు ప్రతినెలా విద్యుత్ బిల్లులు చెల్లించడం అత్యంత భారంగా ఉండేది. కేటగిరీ రెండులో కమర్షిల్ మీటరుగ్లా ఉండేవి. కేటగిరీ- 2 ద్వారా విద్యుత్ బిల్లులను చూస్తే గుండె గుబిల్లుమనేది. పొద్దంతా దుకాణంలో పని చేసినా గిరాకీ అంతంత మాత్రమే ఉండి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొనేది. దీంతో కొందరు దుకాణాలు మూసుకుని ఇతరుల వద్ద పనులకు వెళ్లేది.
గతంలో వీరిని పట్టించుకున్న నాథుడే లేడు
గ్రామాల్లో అనేక అంశాల్లో కీలక పాత్ర పోషించే నాయీ బ్రాహ్మణులు, రజకులను గతంలో పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఇతర వృత్తుల వారికన్నా వీరు అత్యంత వెనుకబడి ఉన్నారు. చరిత్రలో తొలిసారిగా ఈ రెండు వృత్తుల వారికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరింది. దీంతో ఈ రెండు వృత్తుల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో గ్రామీణ ప్రాంతాలో సైతం అధునాతన రీతిలో సెలూన్లు, లాండ్రీ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. తమ వృత్తికి సీఎం కేసీఆర్ వల్ల మళ్లీ వైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం
రజకులు, నాయీబ్రాహ్మణుల ఇబ్బందులను గ్రహించిన సీఎం కేసీఆర్ 2021 ఏప్రిల్లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తక్షణమే అమల్లోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీగాట్లకు 250 యూనిట్ల దాకా కరెంటును ఉచితంగా వాడుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కులసంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భాల్లో తమకు 100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్త్తి చేశారు. ముఖ్యమంత్రి మాత్రం షాపుల్లో వాడుకునే విద్యుత్, చెల్లించే బిల్లులపై పూర్తి స్థాయిలో తెలుసుకుని 100 యూనిట్లు సరిపోవని గ్రహించి ఏకంగా 250 యూనిట్ల విద్యుత్ను ప్రతి నెలా ఉచితంగా వాడుకునేలా వెంటనే జీవో విడుదల చేయించి అమలు చేయించారు. దీంతో రజకులు, నాయీ బ్రహ్మణుల్లో సంతోషం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్తో హెయిర్ కటింగ్ సెలూన్లు, ధోబీగాట్లు, లాండ్రీ షాపులకు ప్రాణం పోసినట్లయింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రతినెలా వీటికి సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం వెంటవెంటనే చెల్లిస్తున్నది.
ఎన్పీడీసీఎల్ పరిధిలో 35,326 మంది లబ్ధిదారులు
ఎడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ఈ పథకంతో అనేక మంది రజకులు, నాయీబ్రాహ్మణులు లబ్ధిదారులయ్యారు. ఆయా షాపు వాళ్లు దరఖాస్తు చేసుకుంటే చాలు వారికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటేడ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలోని 17 జిల్లాల్లో 35,326 మంది లబ్ధిదారులు సోమవారం వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 32,642 షాపులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో 8,706 సెలూన్లు, 26,556 లాండ్రీ షాపులు, 64 ధోబీగాట్లు ఉన్నాయి. 876 కనెక్షన్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోగా, మిగతావాటికి చకచకా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్, వాషర్మెన్ కార్పొరేషన్ల లాగిన్లో దరఖాస్తు చేసుకున్న వారం పది రోజుల్లోనే కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకోసం కేవలం ఎన్పీడీసీఎల్ పరిధిలోనే సుమారు రూ.2 కోట్లను ప్రతినెలా చెల్లిస్తున్నది.
ఉచిత విద్యుత్తో భారం తగ్గింది
మాకు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించడం అత్యంత భారంగా ఉండేది. ఇంటి కిరాయి, కరెంటు బిల్లు వర్కర్కు జీతం ఇచ్చేందుకే ప్రతినెలా సంపాదన సరిపోయేది. ఇలాంటి కష్టకాలంలో మాకు ప్రభుత్వం ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా షాపునకు సంబంధించి ప్రతి నెలా 250 యూనిట్లు మినహాయించి మిగతా బిల్లు చెల్లిస్తున్నాం. గతంలో మాదిరిగా ఇబ్బందులు పడడం లేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు. రాష్ట్ర సర్కారుకు రుణపడి ఉంటాం.
– జంపాల ప్రవీణ్, సెలూన్ యజమాని