రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో మూడు వనాలు ఏర్పాటు చేసి అధికారులు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లోని ఇరిగేషన్ స్థలాల్లో హద్దులు గుర్తించారు. ఎకరానికిపైగా ఉన్న స్థలాల్లో మరిన్ని వనాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైలారం గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గాంధీనగర్ వనాన్ని కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ కెనాళ్ల కట్టలపై 104 కిలోమీటర్ల లీనియర్ ప్లాంటేషన్కు ఇరిగేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
వరంగల్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. హరితహారం ద్వారా ప్రతి సంవత్సరం విస్తృతంగా మొక్కలు నాటుతోంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటింది. కమ్యూనిటీ, బ్లాక్, అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహిస్తున్నది. పల్లె, పట్టణ ప్రకృతి వనాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఒకేచోట ఐదు లేదా పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. ఈ వనాల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు అధికారులు లక్షల మొక్కలు నాటారు. గ్రామాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కోతుల ఆహారం కోసం మంకీ ఫుడ్ కోర్టులను సైతం చేపట్టింది. వీటిలో అధికారులు పండ్ల మొక్కలను నాటారు. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రతి పల్లె, పట్టణంలో పచ్చదనం కనపడుతోంది. తాజాగా ఈ ఏడాది ప్రభుత్వ స్థలాల్లో ‘దశాబ్ది సంపద వనాలు’ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అధికారులు ఇరిగేషన్ (ఎస్సారెస్పీ)కి చెందిన స్థలాలను గుర్తించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే కొన్నిచోట్ల గుర్తించారు. జిల్లాలో ఎస్సారెస్పీ మెయిన్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం జరిగింది. ఈ కెనాళ్లను ఎక్కువ లోతు తవ్విన ప్రాంతాల్లో తీసిన మట్టిని నిల్వ చేయడానికి ప్రభుత్వం అప్పట్లో రైతుల నుంచి కొన్ని ఎకరాల భూములను సేకరించింది. స్థానిక అవసరాలకు మట్టి తరలిపోవడంతో ప్రస్తుతం ఆ స్థలాలు ఖాళీగా ఉంటున్నాయి. క్రమేనా ఇవి అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ స్థలాలను గుర్తించి వీటిలో హరితహారం కార్యక్రమం ద్వారా దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం అవుతున్న తరుణంలో గత జూన్లో ప్రభుత్వం ఇరవై ఒక్క రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వనాలకు ప్రభుత్వం ‘దశాబ్ది సంపద వనాలు’గా నామకరణం చేసింది. ఈ వనాలన్నింటిలో ఆదాయాన్నిచ్చే మొక్కలే నాటాలని స్పష్టం చేసింది. తద్వారా ఇరిగేషన్ ల్యాండ్స్ను ఆక్రమణకు గురికాకుండా రక్షించడంతో పాటు వీటి నిర్వహణతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
స్థలాల గుర్తింపు..
ఇటీవల్ల కలెక్టర్ ప్రావీణ్య ఇరిగేషన్ స్థలాలను గుర్తించడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఇరిగేషన్ అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములయ్యే ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఎస్సారెస్పీ స్థలాలను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ మెయిన్, డిస్ట్రిబ్యూటరీ కాల్వలను తవ్విన సమయంలో మట్టిని నిల్వ చేసేందుకు రైతుల నుంచి సేకరించిన భూములను రికార్డుల ద్వారా గుర్తిస్తున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం, వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల, సంగెం మండలంలోని గాంధీనగర్ గ్రామాల వద్ద ఎస్సారెస్పీ స్థలాలను గుర్తించి హద్దులను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు.
ఈ స్థలాల్లో ‘దశాబ్ది సంపద వనాల’ను చేపట్టారు. మూడు నుంచి రెండు మీటర్ల ఎడంతో గుంతలు తవ్వించారు. కొద్దిరోజుల క్రితం మైలారం గ్రామం వద్ద ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన సంపద వనంలో మొక్కలు నాటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లాలో దశాబ్ది సంపద వనాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్డీవో సంపత్రావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కట్య్రాల వద్ద ఎకరన్నర, గాంధీనగర్ వద్ద రెండున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన సంపద వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో మూడు దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేసి టేకు, నేరేడు, సీతాఫలం, జామ, దానిమ్మ, నిమ్మ, ఖర్జూర, మునగ తదితర రకాల మొక్కలను నాటారు. వీటికి ‘దశాబ్ది సంపద వనం’ బోర్డులనూ ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ డీఆర్డీవో కలిసి గాంధీనగర్ దశాబ్ది సంపద వనాన్ని సందర్శించారు.
కాల్వల కట్టల పైన మొక్కలు నాటాలి
ఈ సారి హరితహారం ద్వారా జిల్లాలోని ఎస్సారెస్పీ కెనాళ్ల కట్టలపైనా లీనియర్ ప్లాంటేషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కెనాల్కు ఒకవైపున మూడు వరుసల్లో వివిధ రకాల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల హద్దులను ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ కట్టలపై 104 కి.మీ పొడవున 26వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మండలం వారీగా చెన్నారావుపేటలో 12, దుగ్గొండిలో 11.6, గీసుగొండలో 10.8, ఖానాపురం లో 0.3, నల్లబెల్లిలో 12.5, నర్సంపేటలో 9.2, నెక్కొండలో 10.8, పర్వతగిరిలో 5.9, రాయపర్తిలో 13.2, సంగెంలో 10.7, వర్ధన్నపేటలో 7 కి.మీ ఉం టుంది. ఇప్పటి వరకు సుమారు 45 కి.మీ మేర కట్టలపై 10,532 మొక్కలు నాటినట్లు డీఆర్డీవో సంపత్రావు వెల్లడించారు. లీనియర్ ప్లాంటేషన్ ముమ్మరంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు.