వర్ధన్నపేట, జూన్ 19 : పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో చేపట్టిన హరితహారం వల్లే వర్షాలు సమృద్ధిగా కురిసి మెరుగైన వర్షపాతం నమోదవుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కట్య్రాల గ్రామంలో అటవీశాఖ, ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం సంపద వనాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుజ్జ సంపత్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వృక్షసంపద గణనీయంగా తగ్గిపోయి గ్రామాలు ఎడారులుగా కనిపించేవన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా గ్రామానికి ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేసి, నాణ్యమైన మొక్కలను పెంచి, నాటించినట్లు చెప్పారు. దీనివల్ల గ్రామాలు మొక్కలతో ఆహ్లాదకరంగా మారాయన్నారు. అంతేకాక తెలంగాణలో 33 శాతం అటవీ సంపద పెరిగి వర్షాభావ పరిస్థితులు కూడా తగ్గిపోయి, క్రమంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణ సమతుల్యత ఏర్పడి మెరుగైన వర్షపాతం నమోదవుతుండడంతో రైతులు సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నారని వివరించారు.
హరితహారంలో అన్ని విభాగాల ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని, పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే, త్వరలో వర్షాలు కురవగానే 9వ విడుత హరితహారం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో హరితవనాలు, పల్లెప్రకృతి వనాలతో గ్రామాలు ఎంతో పచ్చదనంగా కనిపిస్తున్నాయన్నారు. వచ్చే హరితహారంలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటించేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎం సంపత్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సదానందం, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీవో నాగేశ్వర్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.