జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో యువతు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్లో కవితను కలిసి అనుసరించాల్సి వ్యూహాలు, సన్నద్ధతపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో యువత 50 శాతం ఉన్నారని, తమ యూనియన్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అంతేకాకుండా 66శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు. జాతీయ సంఘాల కారణంగా 1998 వరకు కారుణ్య నియామకాలకు గండిపడిందన్నారు. కోలిండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సంస్థను లాభాల బాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని తెలిపారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ దాదాపు 20వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని చెప్పారు. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో కార్మికులకు కేవలం 10శాతం వాటా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 18శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు.
తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలిపారు. ఉద్యోగ విరమణ వయస్సును 80 నుంచి 81కి పెంచామని, గతంలో సమ్మె చేస్తే సంస్థ జీతం ఇచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని తెలిపారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, క్వార్టర్స్లో నివసించే వారు బేసిక్లో 1శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.25లక్షలు చెల్లించాలన్న నిర్ణయం, కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయితే వేతన రక్షణ కల్పించడం, సొంత నిర్మించుకునే వారికి రూ.10లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.