భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయనుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోనుంది. పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి అదే సమయంలో వెళ్లిపోతారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి తల్లులను తిరిగి సాగనంపుతారు. ఈ తంతును వనప్రవేశంగా పిలుచుకునే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.
మేడారానికి దాదాపు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న భక్తులు ఇంటిల్లిపాదితో వచ్చి శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరారు. క్యూలైన్లు, గద్దెల ప్రాంగణంలో దర్శనానికి పోటెత్తారు. గద్దెల ప్రాంగణం ఎడతెరపిలేని గంటానాదాలతో మార్మోగింది. నెత్తిన బంగారం ముద్దలు, చంకన పిల్లలను ఎత్తుకొని వస్తున్నవారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మధ్నాహ్నం ఎండ ఉన్నా, క్యూలో గంటల తరబడి వేచి ఉండి అమ్మవార్లకు మొక్కులు ముట్టజెప్పారు. ఈసారి మహాజాతరకు శుక్రవారం వరకు కోటీ 50లక్షల మంది వరకు తరలివచ్చారని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
తాడ్వాయి, ఫిబ్రవరి 23 : మేడారంలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తకోటి శుక్రవారం పోటెత్తింది. గంటల తరబడి లైన్లలో నిలబడి తల్లులను దర్శించుకోవాల్సి వచ్చింది. ఇదే రోజు ప్రముఖులు దర్శనానికి రావడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్బాబు, సీతక్క శుక్రవారం మధ్యాహ్నం అమ్మవార్లను దర్శించుకున్నారు.
వీఐపీ, వీవీఐపీ ప్రత్యేక దర్శన పాస్లు కలిగి ఉన్న భక్తులు సైతం మూడు నుంచి నాలుగు గంటల పాటు క్యూలో నిల్చుని విసిగివేసారి పోయారు. ఒక సందర్భంలో పోలీసులు భక్తులపై లాఠీచార్జీ చేశారు. దీంతో భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. సీఎం రేవంత్రెడ్డికి, మంత్రి సీతక్కకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.