హనుమకొండ, మే 23 : ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. నాలుగైదు రోజులుగా సూర్యుడు తన విశ్వరూ పం ప్రదర్శిస్తుండడంతో అత్యధిక ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. ఉద యం 8గంటల నుంచి సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొని రహదారులు నిర్మాణుష్యంగా మారుతున్నాయి.
ఎండ వేడిమికి ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వీస్తున్న వడ గాలులకు చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వరకు కూడా వేడి సెగలకు తోడు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకూ వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుతున్నారు. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
ఒకే రోజు 18 మంది మృతి
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 23: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల 18 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), మంగపేట మండలం రామచంద్రునిపేట (సంగంపెల్లి)కు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి(75), కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యల పెద్దరాములు(75), బంగారుగూడెం తండాకు చెందిన మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65),
వరంగల్లోని శంభునిపేట విశ్వనాథకాలనీకి చెందిన సింగారపు కుమారస్వామి (48), ఖానాపురం మండలం మనుబోతులగడ్డకు చెందిన ఆబర్ల ఐలమ్మ (76), డోర్నకల్లోని యాదవనగర్కు చెందిన జానీమియా (45), కాటారానికి చెందిన దుర్గం అంకయ్య(65), రేగులగూడెంలో భూయాన్ వినోద్ (35), ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), తాళ్లపల్లి శాంతమ్మ(90), ఐనవోలుకు చెందిన బండ చిన్న మల్లయ్య(90), జనగామకు చెందిన జ్యోతి(50), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ(60), గణపురం మండలం కొండాపూర్కు చెందిన ల్యాగెల వెంకన్న (48), వరంగల్లోని ఎల్లంబజార్కు చెందిన ఆడెపు రవి(52) ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందారు. కాగా కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుషరాలకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి(45) వడదెబ్బతో మృతి చెందాడు.

పెరుగుతున్న వడదెబ్బ మృతులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడి గాలులు వీస్తుండడంతో రోజు రోజుకు వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ఐదుగురు, గురువారం ఎనిమిది, శుక్రవారం ఏడుగురు, శనివారం 18 మంది వడదెబ్బతో మరణించినట్లు అధికార వర్గాల సమాచారం.

War
జాగ్రత్తలు తప్పనిసరి..
అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావొద్దని అధికార యంత్రాంగంతో పాటు వైద్యులు సూచిస్తున్నారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎకువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బతో అస్వస్థతకు గురైతే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటున్నారు. వాతావరణ శాఖ అంచనా మేరకు మరో రెండు మూడు రోజులు ఎండల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.