కరీమాబాద్, జనవరి 7 : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అడిషనల్ డీసీపీ పుష్ప అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులకు పేరు తీసుకువచ్చేలా మెలగాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలన్నారు. ఆపద సమయాల్లో 100కు ఫోన్ చేయాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింక్లను క్లిక్ చేయవద్దన్నారు. అపరిచితులతో ఆన్లైన్ చాటింగ్ చేయొద్దన్నారు. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ.. కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, డైరెక్టర్ తాళ్ల వరుణ్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు, ప్రొఫెసర్లు బేతి శ్రీనివాస్, పుష్టి, సత్యనారాయణ పట్నాయక్, కల్పనాస్వెయిన్, నాగిరెడ్డి, ఏవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.