హనుమకొండ, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రకాళీ చెరువు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత పనులు చేపట్టింది. అయితే అభివృద్ధి మాటేమో కానీ, చెరువు మాత్రం కబ్జాకు గురవుతున్నది. భద్రకాళీ చెరువుకు వరద వచ్చే భూముల్లో ప్లాట్లు చేసి పూడిక మట్టిని అక్కడికి తరలిస్తున్నారు. వానకాలంలో చెరువులోకి నీటి ప్రవాహం రాకుండా ప్లాట్లలో పూడిక మట్టిని ఎత్తుగా పోస్తున్నారు. జూపార్కు, రైల్వే ట్రాక్ నుంచి నాలాల ద్వారా వచ్చే బురదను అడ్డుకునేలా ఈ ప్రాంతంలోని వందల ఎకరాల్లో కబ్జాదారులు ఇప్పటికే ప్లాట్లు చేశారు. కొందరు ప్రహరీలు కట్టారు.
లోతట్టు ప్రాంతం కావడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద వచ్చి చేరుతున్నది. భద్రకాళీ చెరువు పూడిక మట్టిని ప్రతిరోజూ వందల టిప్పర్లలో ఇప్పుడు కబ్జా ప్లాట్లను ఎత్తుగా చేసేందుకు తరలిస్తున్నారు. అభివృద్ధి, సుందరీకరణ కోసం చేపట్టిన పూడికతీత పనులు ఆ చెరువు స్వరూపానికే ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పూడికమట్టి తరలిస్తున్నామని చెప్పుకుంటున్నారే తప్ప అది ఎవరు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనేది అధికారులు పట్టించుకోవడంలేదు.
అధికారుల అసమర్ధత..
చారిత్రక భద్రకాళీ చెరువులో పూడిక తీయాలని రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్లో నిర్ణయించింది. 382 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక ఉన్నట్లు సాగునీటి శాఖ తేల్చింది. క్యూబిక్ మీటరు మట్టికి రూ.167 చొప్పున నిర్ణయించి టెండరు ప్రక్రియ నిర్వహించింది. పూడికతీత కోసం చెరువును 5 జోన్లుగా విభజించింది. తొలిదశలో మూడు జోన్లలో పనులు 2025 మార్చి 11న మొదలు కాగా, వానకాలం లోపే పూర్తిచేస్తామని సాగునీటి శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అసమర్ధతతో గడువులోపు పనులు పూర్తి కాలేదు. సాగునీటి శాఖ 3.40 లక్షల క్యూబిక్ మీటర్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 3 లక్షల క్యూబిక్ మీటర్లు, మొత్తంగా 6.40 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తరలించారు.
వానకాలం మొదలుకావడంతో పనులు ఆగిపోయాయి. ఏడాది తర్వాత గత నెలలో మళ్లీ పనులు మొదలు కాగా, ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి 11 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసేందుకు సాగునీటి శాఖ టెండర్లు పిలిచింది. మట్టిని తొలగించేందుకు కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చేలా నిబంధనను మార్చింది. రూ. 14 కోట్లు ఖర్చు చేసి పూడిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. రెడ్డిపురం, అమ్మవారిపేట, దీన్ దయాళ్నగర్లోని ప్రభుత్వ స్థలాలకు మట్టిని తరలించాలని పేర్కొంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చిన స్థలాలకే తరలిస్తున్నారు.
ప్రణాళిక లేని సాగునీటి శాఖ..
భద్రకాళీ చెరువు పూడికతీత రెండోదశ పనులు గత నెలలో మొదలయ్యాయి. మట్టి తరలింపుపై సాగునీటి శాఖ ప్రణాళికా వైఫల్యంతో చెరువు అభివృద్ధి ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూడిక మట్టిని ఎక్కడికి తరలించాలనే స్పష్టత లేకుండా పనులు చేపట్టారు. చెరువు సమీపంలో పొలాలు లేకపోవడంతో రైతులెవరూ మట్టి తీసుకెళ్లడంలేదు. కేవలం ఇటుకలు తయారు చేసే వారే తీసుకెళ్తున్నారు. చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని గత వేసవిలో పూర్తిగా తొలగించాల్సి ఉండగా 6.40 లక్షల క్యూబిక్ మీటర్లే తీశారు. ఇటీవల ప్రారంభించిన రెండోదశలోనైనా ఈ పనులు పూర్తవుతాయా? అనేది స్పష్టత లేదు. ఎలాగైనా మట్టిని తరలించాలనే తాపత్రయం తప్పితే ప్రణాళిక లేకపోవడంతో చెరువు భూమిలోనే పూడిక మట్టిని పోస్తున్న పరిస్థితి నెలకొన్నది.