ఖిలావరంగల్, సెప్టెంబర్ 29: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చే నెల 6వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో అర్హులకు సంక్షేమ ఫలాలు అందజేయనున్నారు. మంత్రి చేతుల మీదుగా తూర్పులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం కలిపి మొత్తం 15 వేల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే, లబ్ధిదారులకు దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను కూడా కోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ మేరకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం కోటలోని క్రీడా మైదానాన్ని సందర్శించారు. సుమారు 60 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నందున, అందుకు తగిన మైదానాన్ని పరిశీలిస్తున్నారు. వీఐపీలు, నియోజకవర్గ ప్రజలు వచ్చే మార్గాలు, పార్కింగ్ స్థలాల కోసం అనువైన ప్రదేశాలను అన్వేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, సిద్ధం రాజు, మాజీ కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్యాదవ్, కేడల పద్మ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.