హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 7 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. అండర్-14, 16, 18, 20 బాయ్స్, గర్ల్స్ అండ్ మెన్-ఉమెన్ పోటీలు నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 891మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 100, 400 మీటర్స్ పరుగు పందెంతో పాటు జావెలిన్త్రో పోటీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోరాహోరీగా పోటీలు కొనసాగాయి. అథ్లెట్లు నువ్వా-నేను అన్నట్లు పరుగులు తీశారు. సింథటిక్ ట్రాక్పై చిరుతలా దూసుకెళ్లారు. బంగారు పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ పోటీలను కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రిటైర్డ్ ఎస్పీ నాగరాజు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోనే ప్రతి పల్లెలో క్రీడా మైదానాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వారికి అండగా ఉంటూ ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అక్టోబర్లో సౌత్జోన్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారని వారికి సింథటిక్ ట్రాక్ ఎంతో ఉపయోగపడిందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హనుమకొండ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు, ములుగు సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్రెడ్డి, ఐలి చంద్రమౌళిగౌడ్, కోచ్లు పాల్గొన్నారు.
పతకాల పంట
అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి అథ్లెట్లు పతకాలు సాధించారు. అండర్-20 జావెలిన్త్రో కె.లక్ష్మణ్కుమార్(జయశంకర్ భూపాలపల్లి) బంగారు పతకం సాధించగా అండర్-14 గర్ల్స్ 400 మీటర్స్లో కె.ప్రణీత(హనుమకొండ) బంగారు పతకం, అండర్-16 బాయ్స్ 100 మీటర్స్ పరుగుపందెంలో ఎం.గణేశ్(హనుమకొండ) సిల్వర్, అండర్-14 400 మీటర్స్లో ఎల్.రాము(జనగామ), ఎల్.జ్యోత్స్న(హనుమకొండ) సిల్వర్ మెడల్స్ సాధించారు. అండర్-18 గర్ల్స్ 100 మీటర్స్ పరుగులో ఎస్.అక్షయ(వరంగల్) గోల్డ్, జావెలిన్త్రోలో ఎండీ.కర్మీష(ములుగు) సిల్వర్, అండర్-16 గర్ల్స్ జావెలిన్త్రోలో బూర్గుల తేజశ్రీ(మహబూబాబాద్) గోల్డ్, మెన్స్ విభాగం జావెలిన్త్రోలో సీహెచ్.ప్రశాంత్(హనుమకొండ) సిల్వర్, 100 మీటర్స్ పరుగుపందెంలో ఎం.శ్రీకాంత్నాయక్(హనుమకొండ) సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు.