వర్ధన్నపేట/పర్వతగిరి, మార్చి 8 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఏనుగల్లుపై వరాల జల్లు కురిపించారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మంత్రి బుధవారం ప్రారంభించారు. పుట్టిన ఊరి ప్రజలకు సేవ చేయాలనే భావనతో ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు, ఆయన కుమార్తె హరిణి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కుమారుడు ప్రతీక్ ఆధ్వర్యంలో మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ శిభిరం మూడు రోజుల పాటు ఏనుగల్లులో నిర్వహించడం అభినందనీయమన్నారు. కాగా, శిబిరంలో ఏనుగల్లుతో పాటు 12 తండాలు, ఇతర గ్రామాలకు చెందిన మహిళలకు క్యాన్సర్ పరీక్షలు చేయించనున్నారు.
ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు హెలీప్యాడ్ వద్ద శాసనమండలి ఉప సభాపతి బండా ప్రకాశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, సీపీ రంగనాథ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తనయుడు ఏజీఎఫ్ ఫౌండేషన్ కార్యదర్శి విశాల్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అలాగే, సభ వేదికపైకి వెళ్తున్న మంత్రికి నినాదాలు చేస్తూ మహిళలు స్వాగతించారు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు శ్రద్ధగా విన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ప్ర జాప్రతినిధులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పర్వతగిరి ఎంపీపీ కమల, ఏను గల్లు, మాల్యాతండా, తూర్పుతండా, బట్టు తండా, సర్పంచ్లు సంధ్య, సుజాత, విజయ, అమ్మీ, కూచిపూడి నృత్యకారిణి అన్వితారెడ్డి, గ్రా మానికి చెందిన ప్రతి మహిళకూ చీరె అందించి సత్కరించారు. అలాగే, తండాలకు చెందిన గిరిజన మహిళలు సంప్రదాయ వేశధారణలో సభకు రావడం ఆకట్టుకున్నది. ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలు డాక్టర్ హరిణి మాట్లాడిన తీరును మంత్రి కేటీఆర్ కొనియాడారు.
సభకు అధ్యక్షత వహించిన ఏఎంసీ మాజీ చైర్మన్ టీ నారాయణరావు ఏనుగల్లు అభివృద్ధికి సహకరించాలని, ఏనుగల్లు చుట్టూ గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామంలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, 30 పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేయిస్తానన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో మాట్లాడి ఏనుగల్లుకు తప్పకుండా 30 పడకల దవాఖాన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిమా చైర్మన్ శ్రీనివాసరావు సొంత నిధులతో భవనాన్ని నిర్మించి ఇస్తానని చెప్పగా, శిక్షణా కేంద్రాన్ని ఏనుగల్లుకు మంజూరు చేయడంతో పాటు కేంద్రాన్ని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. అంతర్గత రహదారులనూ మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఏనుగల్లులో జరిగిన సభకు సీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా స్థలానికి దూరంగా ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలకు నీరు, మజ్జిగ ప్యాకెట్లను వలంటీర్లు అందించారు. సభ సక్సెస్ కావడంతో మండల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.