హనుమకొండ సిటీ/గిర్మాజీపేట, ఆగస్టు 25 : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలనే ప్రధాన లక్ష్యంతో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 532 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 138, హనుమకొండలో 54, మహబూబాబాద్లో 125, జయశంకర్ భూపాలపల్లిలో 74, ములుగులో 65, జనగామలో 76 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండడంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల వివరాలను ప్రకటించారు.