క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.6 లక్షలు మంజూరు చేసింది. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సర్వమతాలకు సమప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ అన్నివర్గాల పండుగలకు చేయూతనిస్తున్నారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు, రంజాన్కు ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసినట్లుగానే క్రిస్మస్ వేడుకల కోసం కానుకలు అందించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాకు చేరిన గిఫ్ట్ ప్యాక్లను గోదాముల్లో భద్రపరిచారు. వీటిని ఈ నెల 17 నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జనగామ, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సబ్బండ వర్ణాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కారు సర్వమతాలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కప్పిస్తున్నది. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల్లో పేదలకు దుస్తులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్లుగానే రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆయా సామాజికవర్గాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం, క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నది. ఈ నేపథ్యంలో తెల్లరేషన్కార్డు ఉన్న జిల్లాలోని సుమారు 3 వేల మంది క్రైస్తవ కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ప్యాక్లు మైనార్టీ వెల్ఫేర్ అధికారులకు చేరాయి. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున అందాయి. ఈ కానుకలతోపాటు ఈస్ట్ ఫెస్ట్ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున జిల్లాకు రూ.6 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలను అమలు చేస్తున్నారు. హిందువులకు బతుకమ్మ, ముస్ల్లింలకు రంజాన్ సందర్భంగా కానుకలు అందించినట్లే క్రిస్టియన్లకు క్రిస్మస్ సందర్భంగా దుస్తులు, విందు భోజనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దుస్తుల కిట్లు ఇప్పటికే జిల్లాకు చేరగా ఈనెల 17 నుంచి పంపిణీ చేసేందుకు మైనార్టీ సంక్షేమ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జనగామ నియోజవకర్గానికి జనగామ ఆర్డీవో మధుమోహన్, పాలకుర్తి నియోజకవర్గానికి డీఆర్డీవో పీడీ గూడూరు రాంరెడ్డి,, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి ఆర్డీవో కృష్ణవేణి ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు ఆయా మండలాల తహసీల్దార్లు మండల ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ అర్హులైన పేద క్రిస్టియన్ల ఎంపిక విధానాన్ని పర్యవేక్షిస్తారు.
అంతేకాకుండా వీరి సమక్షంలో నియోజకవర్గాల వారీగా పాస్టర్లతో సమావేశం నిర్వహించి ఆయా మండలాలల్లో పేద క్రిస్టియన్లకు కిట్లను అందించనున్నారు. ఒక్కో కిట్లో చీర, ప్యాంట్, షర్ట్, పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఆయా మండల రెవెన్యూ అధికారులకు కానుకలు చేరాక రేషన్కార్డు కలిగిన అర్హులైన క్రిస్టియన్లుకు వాటిని పంపిణీ చేయనున్నారు. ప్రతి గ్రామంలో స్థానిక పాస్టర్, ప్రజాప్రతినిదులు, అధికారుల సహకారంతో వీటిని అందజేస్తారు. మరోవైపు నియోజకవర్గ కేంద్రంలో జరిగే ఈస్ట్ ఫెస్ట్ వేడుక కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జనగామకు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్లను జిల్లా మైనార్టీ కార్యాలయంలో, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల కానుకలను ఆయా మండల తహసిల్ కార్యాలయం గోదాముల్లో భద్రపరిచారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్న క్రిస్మస్ కానుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ఇస్మాయిల్ పరిశీలించి వాటిని గోదాముల్లో భద్రపరిచారు. వీటిని వీలైనంత త్వరలో పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా క్రైస్తవుల వివరాలు తీసుకుని పంపిణీ చేయనున్నారు.
17 నుంచి క్రిస్మస్ కానుకల పంపిణీ
ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున జిల్లాకు 3 వేల క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు మైనార్టీ శాఖకు అందాయి. వీటిని పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాలకు ఇద్దరు ఆర్డీవోలు, డీఆర్డీవో ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఆయా మండల తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కానుకల పంపిణీ రోజు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి మంది క్రిస్టియన్లకు ఈస్ట్ఫెస్ట్ విందు ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.6 లక్షలు మంజూరయ్యాయి. ఈనెల 17న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే స్థానిక ఎమ్మెల్యేల సమయం తీసుకొని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ, ఈస్ట్ ఫెస్ట్ నిర్వహణ తేదీలను ఖరారు చేస్తాం.
– సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి