తొర్రూరు/పెద్దవంగర/రాయపర్తి, ఫిబ్రవరి 14 : మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో రూ.5కోట్ల10లక్షలతో 3వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం తొర్రూరు మండలం నాంచారిమడూర్, దేవరుప్పుల, రాయపర్తి, పెరికవేడులో కేంద్రాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాంచారిమడూర్లో శిక్షణకు ఎంత మంది హాజరవుతున్నారో ఆరా తీశారు. వెలికట్టకు చెందిన మహిళ రెండు రోజులుగా శిక్షణకు రావడం లేదని తెలుసుకొని మాస్టర్తో నేరుగా ఫోన్ చేయించారు. తనను శిక్షణ కేంద్రలో పనిచేస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకొని మాట్లాడారు. ‘హలో వెన్నెలేనా మాట్లాడేది.. ఇవ్వాల శిక్షణకు ఎందుకు రాలే? మీకు బదులు మరొకరి పేరు ఎకించాలా? మీ మంత్రి చెప్పిండు.’ అంటూ గైర్హాజరుకు కారణాలపై ఆరా తీశారు.
తాను పట్టుబట్టి ఏర్పాటు చేయించిన శిక్షణ కేంద్రాలను మహిళలు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారనే విషయాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. శిక్షణ పొందుతున్న మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతూ ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయో వివరించారు. వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్లో కంపెనీల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు కుట్టడం తదితర ఉపాధి మార్గాలను వివరించారు.
పెద్దవంగర సెంటర్లోనూ శిక్షణార్థులకు స్వయంగా మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ‘హలో సంధ్య నేనా.. కుట్టు మిషన్ శిక్షణకు రాలేదు.. నేను శిక్షణ కాడి నుంచే మాట్లాడుతున్నా.. రేపటి నుంచి తప్పక రావాలే’ అంటూ సూచించారు. మహిళలు స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు.
శిక్షణలో మహిళలకు ఉచిత భోజనం, శిక్షణాంతరం సర్టిఫికెట్, రూ. 13వేల విలువ చేసే కుట్టుమిషన్ను ఉచితంగా ఇస్తామని చెప్పారు. పెద్దవంగరలో మంత్రి వెంట పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వీ రామచంద్రయ్యశర్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, ఏపీఎం నరేంద్రకుమార్, ఉపసర్పంచ్రాము, బీఆర్ఎస్ నాయకులు సుధీర్కుమార్, లింగమూర్తి, వీరన్నయాదవ్, శ్రీనివాస్రెడ్డి, అంజయ్య, ఉపేందర్, రవి, జ్ఞానేశ్వరాచారి, శ్రీనివాస్, సీసీలు సుజాత, పద్మ, సుధాకర్ తదితరులు ఉన్నారు.