కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్రమత్తమైంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో గురువారం వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. కాగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బూస్టర్ డోస్ పంపిణీపై కూడా చేతులెత్తేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సర్కారు నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బయ్యారం, ఏప్రిల్ 20: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో గురువారం వ్యాక్సిన్ పంపిణీ ప్రా రంభమైంది. మూడు దశల్లో కరోనా విలయతాండవం చేయడంతో యావత్ దేశం అతలాకుతలమైంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో కరో నా మహమ్మారి కట్టడి అయింది. కాగా, ఇటీవల దేశం లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా బూస్టర్ డోస్ ఉచిత పంపిణీపై సైతం చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి మరోమారు అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్సీలకు వ్యాక్సిన్ నిల్వలు చేరుకోగా, 22 పీహెచ్సీల్లో పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,81,204 మంది 18 ఏండ్ల పై బడిన వారికి, 37,260 మంది 15-18 ఏండ్ల వారికి, 22,884 మంది 12-14 ఏండ్ల వారికి మొదటి డోస్, 5, 89, 467 మంది 18 ఏండ్ల పై బడిన వారికి, 31, 955 మంది 15-18 ఏండ్ల వారికి, 18,910 మంది 12-14 ఏండ్ల వారికి రెండో డోస్ అందిచారు. అయితే 5,81,808 మంది బూస్టర్ డోస్ వేయించుకోవాల్సి ఉండగా, 2,32,646 (40 శాతం) మంది మాత్రమే తీసుకున్నారు. అందులో 2, 25,516 మంది 18 ఎండ్ల పైబడిన వారు, 4,329 హెల్త్ కేర్ వర్కర్స్, 2,801 మంది ఫ్రంట్లైన్ వర్కర్సు ఉన్నారు. జిల్లాకు 10వేల డోసుల కార్బోవాక్స్ వ్యాక్సిన్ రాగా, పీహెచ్సీలకు అందించారు. ఈ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు పైబడి కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్గా, 12 నుంచి 18 ఏండ్ల వారు మొదటి, రెండో డోస్గా తీసుకున్నారు. కార్బోవాక్స్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు ప్రికాషన్ డోస్ వేసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 36 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. గార్ల, తొర్రూరు మండలాల్లో 26 మంది హాస్టల్ విద్యార్థులు, ఇతర చోట్ల 10 మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం వారు 5 రోజులపాటు ఐసోలేషన్లో ఉంటు వైద్యం పొందుతున్నారు. అయితే వైద్యశాఖ బూస్టర్ డోస్ పంపిణీ తోపాటు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ముమ్మరంగా చేస్తున్నది. కరోనాపై ఏమరుపాటుగా వ్యవహరిస్తున్న ప్రజలకు మాస్క్లు ధరించాలని, శానిటైషన్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు.
మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయించుకోవాలి. జిల్లాలోని పీహెచ్సీలకు 10వేల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా, అన్ని పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్నాయి. ఉచిత వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించాం. ఇప్పటి వరకు 2,32,646 (40శాతం) మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు. మిగతావారు కూడా వేయించుకోవాలి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, నిబంధనలు పాటించాలి.
-డాక్టర్ రాజ్కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్, కరోనా నియంత్రణ అధికారి