శాయంపేట, ఏప్రిల్ 11: చివరి తడికి నీళ్లు అందిస్తే పంటలు పండుతాయని, వెంటనే అధికారులు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. శాయంపేటలోని ఎస్సారెస్పీ డీబీఎం -31 కాల్వ వద్ద నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని గురువారం కౌలు రైతులు నూకంటి మురళి, బెరుగు సతీశ్, నీల రవీందర్, కుమారస్వామి తదితరులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఏప్రిల్ వరకు ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తామని చెప్పడంతో తాము ఎన్నో ఆశలతో మకజొన్న, వరి పంటను సాగు చేసినట్లు తెలిపారు. అయితే డీబీఎం- 31 ప్రధాన కాల్వతో పాటు ఉపకాల్వలకు చివరి ఆయకట్టుకు నీళ్లు అందలేదని చెప్పారు. పంటలు వేసినప్పటి నుంచి రెండు, మూడుసార్లు మాత్రమే నీళ్లు వచ్చాయని వాపోయారు. ప్రధాన కాల్వ ద్వారా నీళ్లు వచ్చినా ల్యాదెళ్ల వద్ద పైన రైతులు అడ్డగించడంతో తమదాకా రాలేదని, సాగు నీటి కోసం తీవ్ర కష్టాలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి రాత్రింబవళ్లు కష్టపడి పంటను కాపాడుకుంటూ వచ్చామని, ప్రస్తుతం పంటకు చివరి తడి పెట్టాల్సి ఉందన్నారు. కాల్వ నీళ్లు రాకపోవడంతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లిస్తామని, ఆరుతడి పంటలేయాలని చెప్పడంతో కౌలుకు తీసుకుని సాగు చేస్తే అప్పులే మిగిలాయని వాపోయారు. శాయంపేట ఎస్సారెస్పీ డీబీఎం-31 పరిధిలో ప్రస్తుతం చివరి తడి అందక 200 ఎకరాలు ఎండిపోతున్నాయని, అధికారులు వెంటనే నీళ్లు విడుదల చేసి పంటను కాపాడాలని కోరారు.
ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయని రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఎంతో ఆశతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మకజొన్న పంట సాగు చేసిన. ప్రధాన కాల్వ నుంచి ఉపకాల్వకు నీళ్లు ఒకటి రెండు సార్లు వచ్చినయ్. రాత్రింబవళ్లు నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేసినం. చివరి తడికి నీళ్లు లేక పంట ఎండిపోయింది. రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే పంటను కాపాడేందుకు చివరి తడికి కాల్వలకు నీటిని విడుదల చేయాలి.
నాకున్న ఎకరంతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని మకజొన్న పంట వేశా. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ పకనే ఉండడంతో నీళ్లు వస్తాయని ఆశతో ఎకరం రూ.14వేల చొప్పున కౌలుకు తీసుకున్నాను. రెండుసార్లు మాత్రమే కాల్వలో నీళ్లు వచ్చినయి. నీళ్లివ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. కౌలుతో పాటు పెట్టుబడి రూ.2.50 లక్షలు నష్టపోయా. ప్రభుత్వమే ఆదుకోవాలి.
నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మకజొన్న పంట సాగు చేసిన. ఎస్సారెస్పీ కాల్వలో రెండు, మూడుసార్లు మాత్రమే నీళ్లు వచ్చినయి. అవి కూడా ఉపకాల్వలో చివరికి మాకు అందలేదు. పంటను కాపాడుకునేందుకు కిలోమీటర్ దూరంలోని దేవుని చెరువు నుంచి 160 పైపులు వేసి దగ్గరలోని ఒక గుంతలో నీళ్లు పోయించుకొన్న. అకడి నుంచి మరో మోటరుతో వారం రోజులు రెండు మోటర్లు పెట్టి మకజొన్న చేనుకు పారించుకున్నా. వేలాది రూపాయలు ఖర్చు చేసినా చివరి తడికి నీరు లేక పంట ఎండిపోతోంది. మరో నాలుగెకరాల్లో వరి పంట కూడా కౌలుకు తీసుకుని సాగు చేశా. అది కూడా ఎండిపోయింది. మొత్తం రూ.3లక్షల వరకు నష్టం జరిగింది. వెంటనే చివరి తడికి నీళ్లు అందించి నష్టపరిహారం చెల్లించాలి.