శాయంపేట, మే 9 : శాయంపేట మండల కేంద్రంలోని శ్రీమత్స్యగిరి స్వామి కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా భక్తజనం కొలుస్తున్నారు. కాకతీయ రాజుల కళా వైభవానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో శనివారం నుండి బుధవారం వరకు జాతరను ఘనంగా నిర్వహించుటకు చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల భిక్షపతి తెలిపారు. శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లయ్య గుట్టపై శ్రీమత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 569 సంవత్సరాల క్రితం కొలువు దీరినట్లుపూర్వీకులు పేర్కొంటున్నారు.
మహావిష్ణువు దుష్టశిక్షణకై నిలిచిన దశావతారాలలో భాగంగా మొదట మత్స్యావతారంగా వెలసినట్లు చెబుతున్నారు. మచ్చర్లయగుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయించిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది. గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మత్స్య అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది. ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుంది. అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడుతున్నది.
కాకతీయ సామంత రాజు కొత్తగట్టు సీమ పాలకుడు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ, సింగమ నాయుడు దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది. కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపోయి గ్రామం మధ్యలో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ గోపురం పైన మహావిష్ణువుదశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి.
కల్యాణోత్సవ కార్యక్రమం…10న శనివారం ఉదయం తోలక్కంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చైర్మన్ భిక్షపతి తెలిపారు. పుట్ట బంగారు సేవ, మధ్యాహ్నం ధ్వజారోహణం, గరుడ ముద్ద , సాయంత్రం ఎదురుకోళ్లు, తేదీ 11 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం, 12 సోమవారం ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ, గుట్టమీదికి పోవడం, 13 మంగళవారం సాయంత్రం రథోత్సవం, అలుకతీరుట 14 బుధవారం ఉదయం చక్ర వరీ, సాయంత్రం నాగవల్లి, పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని ఆయన తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు.