జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నది. ఆయా శాసనసభ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి సమ్మేళనంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆత్మీయ సందేశాన్ని పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్తున్నారు. సోమవారం వరంగల్ ఆరెపల్లిలోని వజ్ర గార్డెన్, పర్వతగిరి మండలం శ్రీనగర్లోని ఎంఎస్ గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నాయి.
వరంగల్, మార్చి 26(నమస్తేతెలంగాణ): ఇప్పటికే జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఈ నెల 23న వరంగల్ రామన్నపేటలోని మణిదీప్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 29, 11 డివిజన్లకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తోపాటు మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఐక్యతతో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 11, 29 డివిజన్లలో 2014 నుంచి జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. నల్లబెల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాంపూర్ సహా మండలంలోని పది గ్రామాల నుంచి బీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, నేతలు, కార్యకర్తలు సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ సాధించిన విజయాలు, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన అభివద్ధి, సంక్షేమాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పెద్ది పిలుపునిచ్చారు. నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీక్షకుంట సహా ఈ మండలంలోని పది గ్రామాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, క్లస్టర్ బాధ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని పెద్ది అన్నారు. మంగళవారం నర్సంపేట నియోజకవర్గం పరిధిలో మరో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ నేతలు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశాన్ని చదివి పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు. ఈ సందేశం సారాంశం… ‘భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే..! అన్నం తినో అటుకులు తినో.. ఉపాసం ఉండో 14 ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించిన రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు.. నవ తెలంగాణ నిర్మాణ యోధులుగా ఈనాడు పట్టుదల.. అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించి పెట్టింది మీరే..! మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్.. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవ్వరికీ సాధ్యం కాని.. ఏకపక్ష విజయాలను సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి మన పార్టీ’!
వరంగల్ ఆరెపల్లి వద్ద గల వజ్ర గార్డెన్లో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ సమ్మేళనానికి వరంగల్లోని 3, 14 డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. అనంతరం పర్వతగిరి మండలం శ్రీనగర్లోని ఎంఎస్ గార్డెన్స్లో మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం కానుంది. ఇక్కడి 16 గ్రామాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఈ సమ్మేళనాల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.