వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 27: కరోనా రూపాంతరాలను మార్చుతూ విరుచుకు పడుతున్న కారణంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో కొవిడ్ వార్డుగా వినియోగించిన మాతా శిశు సంరక్షణా కేంద్రాన్ని మంగళవారం ఎంజీఎం వైద్యాధికారు లు సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంజీఎం ఆవరణలోని మాతాశిశు సంరక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డును బుధవారం నుంచి తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో కొవిడ్ సేవలకు వినియోగించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని తిరిగి 250 పడకలతో కొవిడ్ వార్డుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్డులో మూడు భాగాలు ఏర్పాటు చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్స్ వసతి భవనంలో 110 పడకలతో సాధారణ స్థితిలో ఉన్న బాధితులను, దానికి ఎదురుగా ఉన్న మాతాశిశు సంరక్షణ భవనంలో 140 పడకలతో ఆక్సీజన్ అవసరమున్న బాధితులను, ఐసీయూ చికిత్స అందించాల్సిన బాధితులతో వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎంవో డాక్టర్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ భవనంలో ప్రతి పడకకూ ఆక్సీజన్ పైపులైన్ అందుబాటులో ఉండడంతో పాటు గతంలో కొవిడ్ అవసరాలకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటినే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గతంలో ప్రభుత్వం, దాతలు అందించిన వెంటిలేటర్లను సైతం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఔషధాలను సైతం తగినంద మోతాదులో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ మురళి, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.