హనుమకొండ, ఆగస్టు 6 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అవకతవకలను అరికట్టడమే లక్ష్యంగా కోడిగుడ్లపై ప్రత్యేక ముద్ర వేయించి కేంద్రాలకు సరఫరా చేస్తున్నది. హనుమకొండ జిల్లాలో హనుమకొండ, పరకాల, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 788 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న చిన్నారులు 20,592 మంది, మూడు నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలు 7,506 మంది, 4,398 మంది గర్భిణులు, 3,977 మంది బాలింతలు కలిపి మొత్తం 36,473 మంది లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ కోడిగుడ్లతో పాటు పౌష్టికాహారం సకాలంలో సక్రమంగా అందేలా ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాలో గుణాత్మక మార్పులు చేశారు. ఆన్లైన్ పద్ధతిలో నిరంతర పర్యవేక్షణతో సరఫరా చేయాలని నిర్ణయించారు. కోడిగుడ్ల పరిమాణం, పారదర్శకతకు ప్రత్యేక ముద్రతో కూడిన గుడ్లు పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. నెలలో రెండు విడుతలుగా అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి విడుతలో నీలంరంగు అగ్మార్క్ ముద్ర, రెండో విడుతలో ఎరుపు రంగు మార్క్ ముద్రను జోన్ పేరు స్పష్టంగా తెలిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను జోనల్ స్థాయిలో టెండర్లు నిర్వహించారు. హనుమకొండ జిల్లాకు రంగారెడ్డి జిల్లాలోని నితిషా పౌల్ట్రీఫాం కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో గోడౌన్లో శుద్ధి, ముద్రణ, గ్రేడింగ్, బరువు, నాణ్యతను పరిశీలించిన అనంతరమే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా జరుగుతుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు కోడిగుడ్లు, పాలు అందిస్తుంది. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల ఐసీడీఎస్ మూడు ప్రాజెక్టు పరిధిలోని 788 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి 36,743 మంది ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు సైతం కేంద్రాలకు కోడిగుడ్లు వచ్చిన తర్వాత వాటి నాణ్యత, బరువు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా వెటర్నరీ, మెటరాలజీ అధికారులు, పుడ్ఇన్సెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా సంక్షేమాధికారి కోడిగుడ్ల గోడౌన్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో 36,473 మంది లబ్ధిదారులు
అధికారులు తెలిపిన గణాంకాల ప్రకారం హనుమకొండ జిల్లాలో మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 788 ఉన్నాయి. వీటిలో హనుమకొండ ప్రాజెక్టు పరిధిలో 318, భీమదేవరపల్లి 232, పరకాల పరిధిలో 238 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ మూడు ప్రాజెక్టు పరిధుల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య చిన్నారులు 20,592 మంది, మూడు సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలు 7,506 మంది, 4,398 మంది గర్భిణులు, 3,977 మంది బాలింతలు ఉన్నారు. మొత్తం 36,473 మంది లబ్దిపొందుతున్నారు. వారిలో 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య చిన్నారులు పౌష్టికాహారం, పాలతో పాటు నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అలాగే మూడు సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజుకు ఒకటి చొప్పున ఒక్కొక్కరికి నెలకు 30 కోడిగుడ్లు ఇస్తున్నారు. ఈ కోడిగుడ్లను నెలలో పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడుతలో నీలం రంగు ముద్ర, రెండో విడుతలో ఎరుపు రంగు ముద్రతో పంపిణీ చేస్తారు. ఒక గుడ్డు బరువు తప్పకుండా 45 నుంచి 50 గ్రాములు మధ్య ఉండాలని అధికారులు తెలిపారు. గుడ్లు పాడైపోవడం, మురిగిపోవడం, తేలికగా ఉన్నట్లు అంగన్వాడీ టీచర్లు గమనిస్తే వెంటనే మార్చాల్సి ఉంటుంది. ప్రతి విడుత బయోమెట్రిక్ విధానంలోనే సరఫరా చేస్తారు. అంగన్వాడీ టీచర్ నుంచి మొదలుకొని సూపర్వైజర్, సీడీపీవో, జిల్లా సంక్షేమాధికారి సర్టిఫై చేస్తేనే సరఫరాదారుడికి బిల్లు మొత్తం చెల్లిస్తారు.
పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధుల్లో అంగన్వాడీ కేంద్రాలకు పారదర్శకతతో కోడిగుడ్లు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. కోడిగుడ్లపై ప్రత్యేక రంగు ముద్రను వేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా పదిహేను రోజులకు ఒకసారి రెండు విడుతలుగా జిల్లాకు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. మొదటిసారి నీలం రంగు, రెండోసారి ఎరుపు రంగు ముద్రతో వస్తున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలు అందుతున్నందున తాజాగా ప్రభుత్వం రంగులతో కూడిన ముద్రలు వేసిన గుడ్లు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సకాలంలో చేరడంతో మరింత పారదర్శకత పెరిగింది.
– కే మధురిమ, జిల్లా సంక్షేమాధికారి