కాజీపేట, జూలై 27 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో రైల్వే వ్యవస్థ పూర్తిగా అతులాకుతలమైంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్రాంతాలలోని రైల్వే బ్రిడ్జిలకు వరద నీటి తాకిడి ఎక్కువ కావడంతో ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేశారు. పలు రైళ్ల వేగాన్ని తగ్గించి నెమ్మదిగా నడిపించారు. వడ్డేపల్లి చెరువు రైల్వే బ్రిడ్జి(వంతెన)కు వరద నీరు తాకడంతో రైల్వే అధికారులు కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్ల్లో రైళ్లను రద్దు చేశారు. బలార్ష వైపు వెళ్తే నాలుగు రైళ్లను రైల్వే అధికారులు కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి, ఆలస్యంగా నడిపించారు. రైల్వే జంక్షన్లో రైల్వే అధికారులు ప్రయాణికులకు రైళ్ల సమాచారం తెలిపేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ కౌంటర్ను ఏర్పాటు చేసి రైళ్ల వివరాలను క్షుణంగా తెలిపారు. వర్షాల కారణంగా రైళ్లు రదైన రైలు ప్రయాణీకులకు టికెట్ డబ్బులను రిఫండ్ చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్లోని పట్టాల పైకి వచ్చి చేరింది. కురిసిన వర్షానికి రైల్వే జంక్షన్ ఫ్లాట్ఫారాలపై నీళ్లు వచ్చాయి.
భారీ వర్షం ప్రభావంతో స్టేషన్లోని డ్రైనేజీలు చెత్తాచెదారంతో మూసుక పోవడంతో ఆ నీరంతా రైలు పట్టాలపైన నిలిచిపోయింది. దాదాపు కిలోమీటర్ పొడవున్న ఫ్లాట్ఫారం మధ్యలో నీరు దాదాపు నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నిలిచింది. రైల్వే అధికారులు జాగ్రత్తలు పాటిస్తు, రైళ్లను ఎక్కువ సమయం రైల్వే ఫ్లాట్పారంపై నిలుపకుండా పంపించేశారు. జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశాలతో బ్రిడ్జి సామర్థ్యాన్ని ను పరిశీలించేందుకు లోడుతో ఉన్న ఆరు వ్యాగెన్ బోగీలు, ఎలక్ట్రికల్ రైలింజన్తో బ్రిడ్జిపై నిలిపారు. నాలుగు గంటల తరువాత ఆ ప్రాంతంలో మట్టి కుంగకపోతే రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని లేకపోతే రద్దు చేస్త్తామని చెబుతున్నారు. దీంతో కాజీపేట రైల్వే జంక్షన్-బలార్ష సెక్షన్ మీదుగా నడిచే, గూడ్స్, ప్రయాణికుల రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ఢిల్లీ వైపు నడిచే రైళ్లను కాజీపేట టౌన్ స్టేషన్ల్లో నిలిపివేశారు. తిరుపతి-కరీంనగర్ రైల్వేస్టేషన్ల మధ్య నడిచే కరీంనగర్ ఎక్స్ప్రెస్, ఎర్నాకులం-బిలాస్పూర్ల మధ్య నడిచే బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ రైలు, యశ్వంతాపూర్-లక్నో మధ్య నడిచే లక్నో ఎక్స్ప్రెస్ రైలు, బెంగళూర్-హజరత్ నిజాముద్దీన్ల మధ్య నడిచే రాజధాని సూపర్ఫాస్ట్ రైలును టౌన్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. అకస్మాత్తుగా రైళ్లు ఆగడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్- బలార్ష, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలును 27, 28 తేదీల్లో రద్దు చేశారు. సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ మధ్య నడిచే సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లను గురువారం రద్దు చేశారు. దానాపూర్, తెలంగాణ సూపర్ఫాస్ట్ రైళ్లను బలార్ష, ఆదిలాబాద్, మీదుగా, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా గురువారం దారి మళ్లించి నడుపుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నట్లు చెప్పారు.