బచ్చన్నపేట, ఫిబ్రవరి 19: ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ నెలకొన్న తరుణంలో మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన కందుకూరి సోనీగౌడ్ ఏకంగా మూడు పోస్టులకు ఎంపికై శభాష్ అనిపించుకుంది. కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల కుమార్తె సోనీగౌడ్ నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొన్నె ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. జనగామలో ఇంటర్, డిగ్రీ, బీఈడీ పూర్తి చేసింది. పై చదువుల కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జీనియస్ సీఈవో రాము కోచింగ్ సెంటర్లో 2022, 2023లో ఎస్సై పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంది.
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు పరీక్ష రాసి రెండింట్లో అర్హత సాధించింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన సోనీ గౌడ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టును ఎంచుకుని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో శిక్షణ పొందింది. ప్రస్తుతం ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క జాతరలో డ్యూటీ చేస్తున్నట్లు సోనీగౌడ్ తెలిపారు. ప్రతిభతో మూడు ఉద్యోగాలు సాధించిన సోనీని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.