గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ముంపు నివారణ, శాశ్వత పరిష్కారం కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా ప్రత్యేకంగా రూ.250కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో శాసనసభ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలో వరద సమస్యలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా నాలాల విస్తరణ చేపట్టాలని, వాటిపై అడ్డంకులను తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని అధికారులను ఆదేశించారు. వరద ముంపు నివారణ కోసం హైదరాబాద్ మాదిరిగా ఎస్ఎన్డీపీ చేపట్టాలని ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కోరగా, సానుకూలంగా స్పందించి కార్యాచరణ సిద్ధం చేయాలని, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్, ఆగస్టు 5 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని శాసనసభ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ప్రత్యేకంగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా అదనంగా రూ.250 కోట్ల నిధులను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రత్యేకంగా కేటాయించిన ఈ నిధులతో నగర ప్రజలకు వరద ముంపు నుంచి ఉపశమనం కలిగించేలా అత్యంత కీలకమైన మౌలిక వసతులు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలతో నగరంలో వచ్చిన వరద సమస్యపైన ప్రత్యేకంగా చర్చించిన మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఇచ్చారు. భవిష్యత్లో ఇలాంటి వరదలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణలో భాగంగా నాలాల విస్తరణ చేపట్టాలని, నాలాలపై అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు. వాటిని తొలగించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు.
కబ్జాల తొలగింపు అంశంలో పేద ప్రజలను ఒప్పించి, వేగంగా ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. భవిష్యత్లో నగరం వరద ముంపునకుగురికాకుండా ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా ఉండేందుకే నాలాపై ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నామనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. కాగా, వరంగల్ నగరానికి వరద ముంపు నివారణ కోసం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం ద్వారా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నగర ప్రజా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కోరారు. గతంలో హైదరాబాద్ తరహాలో చేపట్టినట్లు వరంగల్లో ఎస్ఎన్డీపీ ద్వారా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదనలు చేయాలన్నారు. కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి డీపీఆర్ రూపొందించి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతిపాదిస్తే రుణ సౌకర్యం వచ్చే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ వరంగల్లో ప్రత్యేకంగా స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని పురపాలశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ యూనిట్ని ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
ఏడీబీ బ్యాంకు నుంచి రుణం తీసుకునే ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. వరంగల్ నగరంలో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని, వెంటనే పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది సిబ్బంది అధిక షిప్ట్ల్లో పని చేసేలా చూడాలన్నారు. కళాక్షేత్రం నిర్మాణంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, డాక్టర్ తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, సెక్రటరీ సుదర్శన్రెడ్డి, సీడీఎంఏ పమేలా సత్పతి, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.