నల్లబెల్లి, మార్చి 1: అటవీ సంపదను రక్షించి రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ త్వరలో పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోపక్క మండలంలో కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్ అధికారితో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చెట్లను నరికి డోజర్ల సహాయంతో భూమిని చదును చేస్తున్నారని గోవిందాపూర్ గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోవిందాపూర్ శివారు ప్రాంతం కొండాపూర్ బీట్ పరిధిలోని ఫారెస్టు భూములను గుర్తించి అధికారులు స్టెంచ్ ఏర్పాటు చేశారు. ఆ స్టెంచ్ పక్కనే చిన్న కాల్వ ఉంది. దీన్ని అదనుగా భావించిన ఓ ఫారెస్టు అధికారి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అటవీ భూమిని ఓ రైతు పేరున సర్వేలో నమోదు చేసినట్లు తెలిసింది. త్వరలో పోడు రైతులకు సర్వే ఆధారంగా పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది. ఈ క్రమంలో ఓ పథకం ప్రకారం ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేసిన స్టెంచ్ను ధ్వంసం చేసి కొందరు వ్యక్తులు సుమారు మూడెకరాల అటవి భూమిని పోడు చేశారు.
గోవిందాపూర్ శివారు కొండాపూర్ బీట్ పరిధిలో ఉన్న విలువైన మూడెకరాల అటవి భూమిని కొందరు వ్యక్తులు డోజర్తో పోడు చేశారు. ఈ భూమిని పక్కా ప్లాన్ ప్రకారం రూ. 25 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు మండలంలో బాహాటంగానే చర్చ జరుగుతున్నది. అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల గతంలో ప్రజలు అతివృష్టి, అనావృష్టిని ఎదుర్కొని తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీన్ని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తున్నారు. అలాగే, 2005కు ముందు పోడు చేసుకున్న రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇటీవల సర్వే కూడా పూర్తి చేయించారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై విలువైన అటవీ సంపదను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులపై, పోడుకు యత్నించిన వ్యక్తులపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత అటవీ సంరక్షణ సమితి బాధ్యులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.