తాడ్వాయి, మార్చి 24 : మేడారం మహాజాతర సందర్భంగా కోట్లాది రూపాయలు వెచ్చించి హడావుడిగా చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యత లోపించి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లు ప్రస్తుతం పగుళ్లు తేలి కుంగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి స్థానిక బస్టాండ్ నుంచి గద్దెల వరకున్న కల్వర్టులు దెబ్బతిన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సీసీ, బీటీ రోడ్లను తనిఖీ చేసేందుకు క్వాలిటీ కాంట్రోల్ అధికారులు రాకపోవడంతో అందరూ కుమ్మక్కై జేబులు నింపుకున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది. మేడారంలోని బస్టాండ్ నుంచి గద్దెల వరకు నిర్మించిన బీటీ రోడ్డుతో పాటు వనం రోడ్డు, ఊరట్టం నుంచి కాల్వపల్లి వరకు వేసిన బీటీ రోడ్డు, బస్టాండ్ నుంచి హరిత హోటల్ వరకు వేసిన సీసీ రోడ్లు, స్తూపం నుంచి కాల్వపల్లి క్రాస్ వరకు వేసిన రోడ్లు పగుళ్లు తేలాయి. వీటిని నిర్మించి రెండు నెలలు కాకముందే దెబ్బతినడంతో వచ్చే వానకాలంలో వాటి ఆనవాళ్లు లేకుండా పోతాయని స్థానికులంటున్నారు.
మహాజాతరలో అభివృద్ధి పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు దోచుకుతిన్నారనే విమర్శలొస్తున్నాయి. రోడ్ల నాణ్యతపై సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరగా మళ్లీ మరమ్మతులు చేపడుతామని చెబుతున్నారు. వనదేవతల జాతర ముగిసి రెండు నెలలైనా ఇప్పటి వరకు అధికారులు పరిశీలించకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి స్పందించి నాసిరకంగా అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, నాణ్యతను తనిఖీ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని మేడారం ప్రాంత వాసులు కోరుతున్నారు.