సుబేదారి, జనవరి 8 : ఐనవోలు ఎస్సై వీ నవీన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6న ఐనవోలు మండలంలోని వనమాల కనపర్తి కెనాల్ సమీపంలో కాజీపేట బాపుజీనగర్కు చెందిన ఫ్రూట్స్ షాప్ నిర్వాహకుడు కిలారి శోభన్కుమార్, గాంధీ వరప్రసాద్, వరంగల్ ఎల్బీనగర్కు చెందిన చికెన్ సెంటర్ వర్కర్ ఎండీ పర్వేజ్ పాషా, ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మోటె ప్రవీణ్, వనమాల కనపర్తికి చెందిన ఓదెల సాయి కిరణ్, ఘన్పూర్కు చెందిన ప్రవీణ్, టేకులగూడేనికి చెందిన సహాలి గంజాయి విక్రయిస్తుండగా, పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 2.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
శోభన్కుమార్, పర్వేజ్పాషా, మోటె ప్రవీణ్, ఓదెల సాయికిరణ్ పట్టుబడ గా, ప్రవీణ్, సహాలి, గాంధీ వరప్రసాద్ పరారయ్యారు. కాగా, ఈ కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఐనవోలు పోలీసులకు అప్పగించారు. అయితే ఎస్సై నవీన్ ఎన్డీపీఎస్(నార్కో డ్రగ్స్ ప్రివెన్షన్ సెక్షన్) మార్గదర్శకాలు పాటించకుండా నిందితులపై కేసు నమో దు చేశారు. దీంతో ఎస్సై నవీన్పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఐనవోలు ఎస్సైగా అనిల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు.