తొర్రూరు/పాలకుర్తి రూరల్/పెద్దవంగర, మార్చి 13: దివంగత మాజీ మంత్రి నెమురుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో తుదిశ్వాస విడిచారు. యతిరాజారావు-విమలాదేవి దంపతులకు 1950, ఏప్రిల్ 3న జన్మించిన ఆయన, వైద్యుడిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు. హైదరాబాద్ గాంధీ వైద్యశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు.
1999లో ప్రజాదీవెన కార్యక్రమంతో టీడీపీలో చేరిన ఆయన, అదే సంవత్సరంలో పాత చెన్నూరు (పాలకుర్తి)నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు మధుసూదన్రెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జలాల తరలింపు, రోడ్లు, స్కూళ్ల అభివృద్ధి, వాటర్ ట్యాంకుల నిర్మాణం, మోడల్ స్కూల్స్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో దుగ్యాల శ్రీనివాస్రావు చేతిలో ఓడిపోయారు.
2009లో పాలకుర్తి నియోజకవర్గం ఏర్పడగా 2010లో తొర్రూరు సభలో ఉద్యమ నేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఎర్రబెల్లి దయాకర్రావు చేతిలో ఓడిపోయారు. 2018, 2023 ఎన్నికల్లో దయాకర్రావు విజయం కోసం పనిచేశారు. 2023 ఆగస్టు 21న కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఇటీవలే రాజీనామా చేశారు. 1969లో తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొన్నారు. మలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పని చేశారు.
గురువారం ఉదయం స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లికి సుధాకర్రావు భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. అంత్యక్రియలకు మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు హాజరు కానున్నారు. సుధాకర్రావు భౌతికకాయాన్ని హాస్పిటల్లో ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన మృతికి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, రాపోల్ ఆనందభాస్కర్ సంతాపం తెలిపారు.